– ఇందిరమ్మ కాలనీలో ఇష్టారాజ్యం
– కన్నెత్తి చూడని రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు
ఖమ్మం రూరల్, జూలై 01 : జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఏదులాపురం మున్సిపాలిటీ కార్యాలయానికి సమీపంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో భూ ఆక్రమణలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వెల్లివిరుస్తుంది. సాక్షాత్ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న 23వ వార్డులో సర్కారు భూములు ఫలహారంగా మారుతున్నాయి. సర్వే నంబర్ 142 లో గత కొద్ది సంవత్సరాలుగా ఇండ్ల స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ఇళ్ల స్థలాలు ఆవిరైపోగా తాజాగా మిగిలిన స్థలాలను సైతం అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు పొజిషన్ పట్టాల పేరుతో ఆక్రమణలకు తెరలేపారు. దీంతో గత పక్షం రోజుల నుండి కాలనీవాసులు ఆక్రమణదారుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. సర్కారు భూములపై కన్నేసిన పలువర్గాలు వాటిని చేతికి ఇచ్చుకునేందుకు దొడ్డిదారిలో ప్రయత్నాలు చేసి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు.
ఈ కాలనీలో అనేక గొడవలు జరగడమే కాకుండా పోలీస్ స్టేషన్ వరకు పంచాయతీ వెళ్లినప్పటికీ సంబంధిత రెవెన్యూ మున్సిపల్ అధికారులు మాత్రం ఆక్రమాలకు ముగింపు ప్రయత్నం చేయకపోవడం కొసమెరుపు. ఇక్కడ జరుగుతున్న భూ దందాపై రెవెన్యూ అధికారుల దృష్టికి కాలనీవాసులు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నూతన నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ ఇటు మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే సర్కారు భూముల వ్యవహారంపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.