సత్తుపల్లి, జనవరి 20: ఆయిల్పాం సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలుఅందిస్తున్నదని, రాష్ట్రవ్యాప్తంగా సాగును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రేగళ్లపాడు పంచాయతీలో శుక్రవారం టీఎస్ ఆయిల్ఫెడ్, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతులకు రాయితీపై ఆయిల్పాం మొక్కలు పంపిణీ చేసి మాట్లాడారు. ఆయిల్పాం సాగుకు నానాటికీ ఆదరణ పెరుగుతున్నదన్నారు. ప్రభుత్వం రేగళ్లపాడులో 55 ఎకరాల్లోని నర్సరీలో మొక్కల పెంపకం చేపడుతున్నదన్నారు. తెలంగాణ నుంచి రైతులు పెద్ద ఎత్తున ఆయిల్పాం సాగుచేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతులకు సహకరించడం లేదని మండిపడ్డారు. ఆయిల్పాం మొక్కల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. కేంద్రం మొక్కల ఉత్పత్తిపై దృష్టి సారించాలన్నారు. కేంద్రం ఆయిల్పాం రైతులకు జీఎస్టీ తగ్గించాలన్నారు. టన్ను ఆయిల్పాం గెలల ధర రూ.20 వేల మద్దతు ధర కల్పించాలన్నారు. ఇప్పటికే అశ్వారావుపేట, అప్పారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీలు అందుబాటులో ఉన్నాయన్నారు.
సర్కార్ వేంసూరు మండలం కల్లూరిగూడెంలో 25 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నదన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా జిల్లాలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్ పాం సాగును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఆయిల్ పాం సాగుపై ప్రత్యేక దృష్టి సారించి ఆత్మహత్యలు లేని తెలంగాణ కోసం కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా 46 వేల చెరువులను పటిష్టం చేశారన్నారు. పంటలకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారన్నారు. తెలంగాణను అన్నపూర్ణగా మార్చారన్నారు. మొక్కల పంపిణీలో ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండదన్నారు. రైతులెవరూ అధైర్యపడాల్సిన అవసరంలేదన్నారు. మొక్కల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఆయిల్ఫెడ్ అందిస్తుందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటలు పండించడం మొదలు పెట్టారన్నారు. దీనిలో భాగంగా మున్ముందు ఆయిల్ పాం సాగు మరింత విస్తరిస్తుందన్నారు. కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను చేపట్టి వ్యవసాయాన్ని పండుగ చేశారన్నారు. తొలుత ఎమ్మెల్యే నర్సరీలో మొక్కలను రైతులు, ఆయిల్ఫెడ్ అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రాధికా గుప్తా, డీహెచ్ఎస్వో అనసూర్య, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, డివిజనల్ ఆఫీసర్ బాలకృష్ణ, ఆయిల్ఫెడ్ సిబ్బంది కృష్ణారావు, యుగంధర్, నాగలక్ష్మి, హర్షిత, నవ్య, ఏవో వై.శ్రీనివాసరావు, సర్పంచ్లు వడ్డంగి విజయ, కారం జయేందర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఎంపీపీ దొడ్డా హైమావతి, ఆత్మచైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, సత్తుపల్లి మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఎంపీటీసీలు సున్నం సుశీల, బొడ్డు శివరామకృష్ణ, కాకర్లపల్లి సొసైటీ అధ్యక్షుడు తుమ్మూరు శ్రీరాంప్రసాద్, నాయకులు దుర్గాప్రసాద్, తుమ్మూరు శ్రీను, సురేందర్, దొడ్డా శంకర్రావు, వల్లభనేని పవన్, రఫీ, అంకమరాజు, మట్టా ప్రసాద్ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మా గ్రామంలో 55 ఎకరాల్లో ఆయిల్పాం నర్సరీ ఏర్పాటు చేసింది. నర్సరీలో ప్రతిరోజూ 100 మంది కూలీలకు ఉపాధి పొందుతున్నారు. ఆయిల్ఫెడ్ స్థానిక రైతుల నుంచి 55 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని నర్సరీ నడిపిస్తున్నది. లీజుతో రైతులకూ ఆదాయం లభిస్తున్నది.
– వడ్డంగి విజయ, సర్పంచ్, రేగళ్లపాడు
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఆయిల్పాం మొక్కలు అందిస్తున్నది. గతంలో మొక్కల కోసం తీవ్రంగా ఇబ్బంది పడేవాళ్లం. నేడు దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ సీరియల్ ప్రకారం మొక్కలు అందుతున్నాయి. నేను 10 ఎకరాల్లో ఆయిల్ పాం తోట సాగు చేసేందుకు దరఖాస్తు చేసుకున్నాను. నాకు అవసరమైనన్ని మొక్కలు అందాయి. ఆయిల్పాం సాగును ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. – పాకలపాటి రామారావు, రైతు, లచ్చన్నగూడెం