వానకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కంపెనీల పేరుతో నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఏటా ఇదే తంతు జరుగుతుండడం, రైతులు తీవ్రంగా నష్టపోతుండడంతో ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. వివిధశాఖల అధికారులతో కలిపి టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు విత్తన విక్రయ దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు చేపడున్నాయి. డీలర్లు ఏయే విత్తనాలను విక్రయిస్తున్నారు..? ఎవరికి విక్రయిస్తున్నా..? రసీదు నంబరు ఏమిటి? వంటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నాయి. విత్తన ప్యాకెట్లపై సరైన పేరు, గడువు తేదీ, బార్కోడ్ లేని వాటిని రైతులు కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకున్నాయి. కాగా, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు తప్పకుండా బిల్లులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దళారులు, ప్రైవేటు కంపెనీల ప్రతినిధులతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
సుజాతనగర్, మే 16 : వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తున్న భద్రాద్రి జిల్లాలో విత్తనాలకు డిమాండ్ పెరిగింది. దీంతో వివిధ కంపెనీల పేర్లతో నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. అధిక లాభాలకు ఆశపడి పలుచోట్ల డీలర్లు గుట్టుచప్పుడు కాకుండా రైతులకు విక్రయిస్తున్నారు. దీంతో పంట సాగు చేసిన రైతులు ఆశించిన మేరకు దిగుబడి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు నూతన చర్యలు చేపట్టింది. వానకాలం సీజన్ నుంచి విత్తన డీలర్లు ఏయే ఎరువులు విక్రయిస్తున్నారు.? స్టాక్ ఎంత ఉంది.? ఎవరికి విక్రయించారు.? రశీదు నంబర్? లాంటివి ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ఆన్లైన్ నమోదు ప్రక్రియపై డీలర్లకు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం వారి పనితీరును పర్యవేక్షించేందుకు టాస్క్ఫోర్స్ టీంను కూడా సిద్ధం చేసింది.
ఇప్పటి నుంచి అన్నదాతలను మోసం చేసే వారు ఎవరైనా సరే ఊరుకునేది లేదని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించింది.
వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రతి ఏడాది సాగు విస్తీర్ణం పెరుగుతోంది. విత్తనాలకు కూడా డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించి వివిధ కంపెనీల పేరుతో మార్కెట్లోకి నకిలీ విత్తనాలు వస్తున్నాయి. రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. పోలీసులు, వ్యవసాయరంగంలో ఈ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది భద్రాద్రి జిల్లాలో నకిలీ పత్తి, మిర్చి విత్తనాలతో పలువురు రైతులు నష్టపోయారు. రైతుల పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేలా పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టింది. వానకాలంలో విత్తన డీలర్లు ఏయే కంపెనీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్నారు, ఎంత స్టాక్ ఉంది, ఎవరికి అమ్ముతున్నారనే వివరాల నమోదుకు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పకడ్బందీ చర్యలు…
నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న వర్షాకాలం సీజన్లో నకిలీ విత్తనాల అడ్డుకట్టకు ఇప్పుడే చర్యలు చేపడుతున్నారు. ఈ విషయమై రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. పంటల సాగు విషయంలో విత్తనాలను పునాదిగా భావించి నాణ్యమైన విత్తనాలను రైతులకు ప్రభుత్వపరంగా, ప్రైవేట్పరంగా అందించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులందరికీ నాణ్యమైన విత్తనాలను అందించేందుకు సర్కార్ నూతన విధానాన్ని అమలు చేస్తుండగా ఇందులో ముఖ్యంగా విత్తనాల డీలర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఎరువులు, విత్తనాల స్టాక్ వివరాలు ఆన్లైన్లో నమోదుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్నదాతలకు నష్టం కలిగించే వారెవరినైనా క్షమించేది లేదని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త విధానం అమలుకు సన్నాహాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి, పొద్దుతిరుగుడు తదితర పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. ప్రతి వానాకాలం సీజన్లో పంటల సాగు పెరుగుతూ వస్తోంది. వానాకాలం నుంచి ఆన్లైన్ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఇందుకోసం రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువుల వివరాలు, స్టాక్ నంబర్ పంపిణీ, రశీదు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలి. తద్వారా ఏ డీలర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేశారనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు మొలకెత్తకపోయినా, దిగుబడి రాకపోయినా డీలర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. విత్తన ప్యాకెట్లపై పేరు, గడువు తేదీ, బార్కోడ్ లేని వాటిని కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు తప్పకుండా బిల్లులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అనుమతులు లేకుండా విత్తనాలు విక్రయిస్తే పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరుతుంది.
నకిలీలపై నజర్
వివిధ కంపెనీల పేర్లతో నకిలీ విత్తనాలు రైతులకు విక్రయించే వారిపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అధిక లాభాలకు ఆశపడి డీలర్లు గుట్టుచప్పుడు కాకుండా వాటిని రైతులకు విక్రయిస్తున్నారు. దీంతో సాగు చేసిన రైతులు దిగుబడులు రాకుండా నష్టపోతున్నారు. అక్రమాలకు పాల్పడే డీలర్లకు చెక్ పెట్టి అన్నదాతలకు నాణ్యమైన విత్తనాలు విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఆన్లైన్ విధానాన్ని సక్రమంగా అమలుచేసేలా అధికారులు డీలర్లకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నకిలీ విత్తనాలు, పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి వచ్చే అవకాశం ఉన్నందున వాటికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో కేసులు నమోదైన డీలర్ల వివరాలను అధికారులు సేకరించేందుకు సిద్ధమయ్యారు.
జిల్లావ్యాప్తంగా ఐదుగురిపై కేసు
జిల్లా వ్యాప్తంగా గత ఏడాది అనుమతులు లేకుండా విత్తనాలు విక్రయిస్తున్న ఐదుగురు డీలర్లపై కేసు నమోదైంది. ఇందులో బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామంలో 2.6కిలోల మిర్చి విత్తనాలు అమ్ముతున్న ఒకరిపై కేసు నమోదైంది. దాని విలువ సుమారు రూ.18.2 లక్షలు. అదేవిధంగా పినపాకలో అనుమతులు లేకుండా విక్రయిస్తున్న రెండు కిలోల మిర్చి విత్తనాలను టాస్క్ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. దాని విలువ రూ.4.7 లక్షలు ఉంటుంది. టేకులపల్లి మండలంలో అనుమతులు లేకుండా విక్రయిస్తున్న మొక్కజొన్న విత్తనాలను సీజ్ చేశారు. వాటి విలువ రూ.68 వేలు. ఇల్లెందులో మొక్కజొన్న విత్తనాలు సీజ్ చేశారు. వాటి విలువ రూ.1.4 లక్షలు ఉంటుంది. అదేవిధంగా నిషేధిత కలుపు మందు విక్రయిస్తున్న వ్యక్తిపై జూలూరుపాడులో కేసు నమోదు చేశారు. వాటి విలువ సుమారు రూ.5.57 లక్షలు ఉంటుంది. గత ఏడాది జిల్లావ్యాప్తంగా రూ.33.76 లక్షలకు సంబంధించిన అనుమతులు లేని విత్తన ప్యాకెట్లను సీజ్ చేశారు. గత మూడు సంవత్సరాల నుంచి టాస్క్ఫోర్స్ సిబ్బంది నకిలీ విత్తనాలపై నిఘా వేసి పట్టుకుంటున్నారు. గత ఏడాది ఐదు కేసులు, అంతకుముందు సంవత్సరం 12కేసులు కలిపి మొత్తం 17కేసులు నమోదైనట్లు తెలిసింది.
బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలి
నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆన్లైన్ విధానం ఎంతగానో దోహదపడుతుంది. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై నేరుగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. నకిలీ విత్తనాలు అమ్మినా, వాటిని అక్రమంగా రవాణా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేలా సీడ్ కార్పొరేషన్తోపాటు విత్తన కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి రైతు కొనుగోలు చేసిన విత్తనాలకు బిల్లులు తీసుకోవాలి.
– కొర్సా అభిమన్యుడు, డీఏఓ, కొత్తగూడెం