కూసుమంచి, మార్చి 20 : జీవాల మేత కోసం ఇతర ప్రాంతాల నుంచి ఖమ్మంజిల్లాకు గొల్ల, కురుమలు వలసొస్తున్నారు. వారి ప్రాంతాల్లో మేత లేకపోవడంతో మహబూబ్నగర్, హైదరాబాద్, నల్లగొండ, ఇబ్రహీంపట్నం, దామరచర్ల, పిడుగురాళ్ల వంటి తదితర ప్రాంతాల నుంచి వేలాది జీవాల మందలతో వచ్చారు. ఇక్కడ మిర్చితోటలు, వరి పొలాలు కోసిన తరువాత మేత దొరుకుతుందని అనేక ప్రాంతాల నుంచి గొర్రెల మందలను తోలుకొని వలసవచ్చారు. ప్రస్తుతం కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో వీరు సంచరిస్తున్నారు. గొల్ల, కురుమలకు రైతులు డబ్బులిచ్చి జీవాల మందలను వారి చేలల్లో ఎరువు కోసం రాత్రిళ్లు నిలిపి ఉంచుతున్నారు. ఈవిధంగా సుమారు రెండునెలలపాటు ఈ ప్రాంతంలో రైతుల పొలాలు, చేలలో ఎరువులు పెట్టేవిధంగా వాటిని ఉపయోగిస్తున్నారు.
సంచారం చేస్తున్న గొల్ల, కురుమల బరువులు మోయడానికి గాడిదలు, గుర్రాలు, కాపలా కోసం కుక్కలను వెంట తీసుకొచ్చారు. జీవాలను ఉదయం మేతకు తీసుకెళ్లడం, రాత్రిళ్లు పొలాల్లో ఎరువు కోసం ఉంచడం చేస్తున్నారు. బుధవారం కూసుమంచిలో గొల్ల, కురుమలను ‘నమస్తే’ పలుకరించగా సుమారు 40 బ్యాచ్లు గత 15 రోజులుగా ఈ ప్రాంతంలో జీవాల మేత కోసం తిరుగుతున్నట్లు చెప్పారు. తమ ప్రాంతాల్లో జీవాలకు మేత దొరకడం లేదని, ఈ పరిస్థితి గత 20 ఏండ్ల కింద వచ్చిందని యాదవులు తెలిపారు. వలసొచ్చిన వారిలో ఎవ్వరిని కదిలించినా వారి మందలో సుమారు 150కి పైగా జీవాలు ఉన్నట్లు చెబుతున్నారు.
మా దగ్గర మేత లేదు. అందుకే ఇక్కడికి వలసొచ్చాం. ఇక్కడ కూడా మేత పెద్దగా లేదు. సుమారు ఐదువేల మందతో 10 కుటుంబాల వాళ్లం వచ్చాం. ఈ ప్రాంతంలో చినుకుపడేదాక ఉంటాం. ఎరువు కోసం రైతుల భూముల్లో మందను ఆపితే వాళ్లు డబ్బులు ఇస్తారు. వాటిని ఇంటికి పంపిస్తాం. రోజుకు 800 నుంచి రూ.వెయ్యి వరకు ఇస్తున్నారు.
– రావు జంగమయ్య, రాప్రోలు, ఇబ్రహీంపట్నం
మాది నిమ్మికల్లు. మా దగ్గర మేత దొరుకుతలే. ఎండాకాలం జీవాలను బతికించుకోవాలంటే వలస వెళ్లాల్సిందే అనుకొని బైలెల్లినం. 20ఏండ్ల కిందట గిట్లనే కాలం కాలేదు.. గప్పడు కూడా వలసొచ్చాం. కుటుంబంతో కలిసి అందరం వచ్చాం. బరువులు మోయడానికి గుర్రాన్ని తెచ్చుకున్నాం. రైతులు ఎరువు కోసం రాత్రిళ్లు మందను తమ భూముల్లో ఆపుకొంటున్నారు. వాళ్లు ఇచ్చే డబ్బులతో జీవనం గడిపేస్తున్నాం.
– బయ్యా మల్లయ్య, నిమ్మికల్