భద్రాచలం, మార్చి 24 : భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అంతరాలయంలోని మూలవరులకు 108స్వర్ణ పుష్పాలతో అర్చన జరిపారు. ఉదయం అంతరాలయంలోని ధృవమూర్తులకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, ఆరగింపు, సేవాకాలం తదితర నిత్యపూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను బేడా మండపానికి తీసుకొని వచ్చి సంప్రదాయబద్ధంగా కల్యాణం జరిపించారు.
హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని స్వామివారికి డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించడంతోపాటూ స్వామివారి పెండ్లి పనుల కోసం పసుపు కొమ్ములు దంచుట, తలంబ్రాలు కలుపుట తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నందున రామయ్యకు నిత్యం జరిపే కల్యాణాన్ని సోమవారం నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి తెలిపారు. అలాగే స్వామివారికి ప్రతి సోమవారం జరిపే ముత్తంగి అలంకరణను నిలిపివేస్తున్నామని, భక్తులు ఈ విషయాన్ని గమనించుకోవాలని ఆమె కోరారు.