భద్రాచలం, అక్టోబర్ 3 : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం 8వ రోజు లక్ష్మీతాయారు అమ్మవారు ‘వీరలక్ష్మి’ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి పంచామృతాలు, పండ్లరసాలు, తులసీమాలలు, నారీకేళ జలములతో ప్రత్యేక అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు మహిళలు అధికసంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు.
మధ్యాహ్నం 3గంటలకు అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, లక్ష్మి అష్టోత్తర శతనామావళి పారాయణం నిర్వహించారు. చిత్రకూట మండపంలో 108పారాయణదారులు శ్రీమద్రామాయణంలోని యుద్ధకాండను పారాయణం చేశారు. ముందుగా ఉత్సవమూర్తులను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ చిత్రకూట మండపానికి తీసుకొని వచ్చి, సూర్యప్రభ వాహనంపై ఉంచి పూజలు చేశారు. సాయంత్రం తాతాగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ జరిపారు.
నేడు మహాలక్ష్మి అలంకారంలో..
భక్తుల కోర్కెలను తీర్చడానికి లక్ష్మీదేవి మంగళవారం మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ రూపంలో అమ్మవారిని ఆరాధిస్తే ఐష్టెశ్వర్యాలు కలగడంతోపాటు అన్నింటా విజయం సిద్ధిస్తుందని పండితులు తెలిపారు.