– మాజీ జడ్పీటీసీ కవిత
– పాలిటెక్నిక్ విద్యార్థులకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు
ఎర్రుపాలెం, ఆగస్ట్ 21 : పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం కలిగించేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మాజీ జడ్పీటీసీ శీలం కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ… పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు. పాలిటెక్నిక్ విద్య అనేది సాధారణ విద్య కాదని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్యలో ముందుకు వెళ్లేందుకు ఇది కీలక మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యాలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందుతున్నారని తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్ను ప్రభావితం చేసే నిర్ణయాలను హడావుడిగా తీసుకోకుండా, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాలిటెక్నిక్ అధ్యాపకులు, సాంకేతిక విద్య నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. విద్యార్థుల అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరించాలని సూచించారు. ఎస్బీటీఈటీ పరిధిలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంవత్సరాలుగా ప్రత్యేక గుర్తింపు ఉందని, పరీక్షలు, సిలబస్, అఫిలియేషన్, డిప్లొమా సర్టిఫికెట్లు తదితర కీలక అంశాలు ఈ వ్యవస్థ ద్వారానే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 2026లోనూ ఎస్బీటీఈటీ పాలిసెట్ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిందని గుర్తుచేశారు.
విద్యార్థుల భవిష్యత్ను ప్రభావితం చేసే నిర్ణయాలను హడావుడిగా తీసుకోకుండా ప్రభుత్వం పునఃపరిశీలించాలని శీలం కవిత కోరారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, పాలిటెక్నిక్ అధ్యాపకులు, సాంకేతిక విద్యా నిపుణులతో చర్చించాలని సూచించారు.
జీవో 97 వల్ల విద్యార్థులకు కలిగే ఇబ్బందులు, ఉన్నత విద్యకు సంబంధించిన అవకాశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి, విద్యార్థుల ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి విద్యార్థుల ఆందోళనలను సానుభూతితో పరిశీలించి, జీవో 97ను పునఃసమీక్షించాలని కోరారు. అన్ని వర్గాలతో విస్తృతంగా చర్చించిన అనంతరం విద్యార్థుల ప్రయోజనాలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.