హరితహారం కార్యక్రమానికి వేళయింది. నర్సరీల్లో పెంచిన మొక్కలను తొమ్మిదో విడతలో పట్టణాలు, గ్రామాల్లో నాటేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలో కోటి మొక్కలు నాటేందుకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించగా.. జిల్లా యంత్రాంగం శాఖల వారీగా మొక్కలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పండుగ వాతావరణంలో మొక్కలు నాటనున్నారు. నాటిన మొక్కలను రక్షించేందుకు.. చనిపోయిన వాటి స్థానంలో కొత్తవి నాటేందుకు.. మొక్కల లెక్క తప్పకుండా ఉండేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు.
ఖమ్మం, జూలై 12 : ‘వనాలు పెరగాలి. వానలు వాపస్ రావాలి’ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నం సాకారమవుతోంది. ఇప్పటికే ఎనిమిది విడతలుగా నాటిన హరితహారం మొక్కలతో ఖమ్మం జిల్లా హరితావరణాన్ని సంతరించుకుంది. తాజాగా తొమ్మిదో విడతకు సిద్ధమవుతోంది. అధికార యంత్రాంగం కూడా ఇందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ సారి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో 43 లక్షల మొక్కలు నాటేలా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించడంతో అధికారులు అందుకు అనుగుణంగా సమాయత్తమవుతున్నారు. ఇవిగాక నగరాలు, పట్టణాల్లో మరికొన్నింటిని నాటనున్నారు. ఇప్పటికే డీఆర్డీఏ ఆధ్వర్యంలో వివిధ నర్సరీల్లో పది లక్షల మొక్కలు, వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో 33 లక్షల మొక్కలు పెంచారు. వీటిల్లో కొన్నింటిని ప్రజాప్రతినిధులు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేస్తున్నారు. ప్రజలు కూడా ఇటీవల కురిసిన చిరుజల్లులకు తమ తమ నివాస ప్రాంతాల్లో వాటిని నాటుతున్నారు. డీఆర్డీఏ ద్వారా గ్రామాల్లో ఇప్పటికే 96,612 మొక్కలను నాటారు. ఈ సారి నాటిన ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తొమ్మిదో విడతకు సిద్ధంగా..
తొమ్మిదో విడత హరితహారం కోసం అధికారులు ఆయా నర్సరీల్లో మొక్కలను పెంచి సిద్ధంగా ఉంచారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటనున్నారు. వర్షాలు ప్రారంభమైనందున గుంతలు తవ్వే కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. ఈ సారి నా టిన ప్రతి మొకకూ జియో ట్యాగింగ్ చేయనున్నారు. ఎనిమిది వి డతలుగా నాటిన మొక్కలు ఇప్పటికే పెద్దవై వృక్షాలుగా మారి పచ్చదనాన్ని పంచుతున్నాయి. వాణిజ్య మొక్కల్లో టేకు, సుబాబుల్, జామాయిల్ క్లోన్స్, పూల మొక్కల్లో టేకోమ, గన్నేరు, మందారం, పండ్ల మొక్కల్లో ఉసిరి, దానిమ్మ, నిమ్మ, జామ, కరివేపాకు, బొప్పాయి, నీడనిచ్చే మొక్కల్లో వేపకానుగ, రావి మర్రి, సీమ తంగేడు, పెల్టోఫారం, గుల్మోహార్ తదితర మొక్కలను సిద్ధంగా ఉంచారు. వీటిని జిల్లాలోని 500 నర్సరీల్లోనూ, అటవీ శాఖ, డీఆర్డీఏ, మున్సిపాలిటీ, ఉద్యానవన శాఖల నర్సరీల్లోనూ పెంచారు.
ఎనిమిదేళ్లుగా అప్రతిహతంగా..
2014-15 ఆర్థిక సంవత్సరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఎనిమిదేళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతోంది. దీంతో రాష్ట్రమంతటా పచ్చదనం పరిఢవిల్లుతున్న విషయం విదితమే. దీని స్ఫూర్తితో ఈ సారి తొ టమ్మిదో విడతను మరింత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇం దులో ప్రధానంగా ప్రజలను భాగస్వాములను చే స్తోంది. వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తోం ది. ప్రతి ఇంటికీ ఆరు చొప్పున మొక్కలు పంపిణీ చేసి వాటిని నాటేలా చర్యలు తీసుకుంటోంది.
9వ విడత ప్రారంభం..
డీఆర్డీఏ ఆధ్వర్యంలో చింతకాని, ఖమ్మం రూరల్, మధిర, కొణిజర్ల, సత్తుపల్లి, భోనకల్లు, నేలకొండపల్లి, కూసుమంచి, పెనుబల్లి, తిరుమలాయపాలెం, ముదిగొండ, ఎర్రుపాలెం, సింగరేణి, ఏన్కూరు, తల్లాడ, వేంసూరు, కామేపల్లి మండలాల్లో 50 వేల చొప్పున, వైరాలో 25 వేలు, కల్లూరులో 55 వేలు, రఘునాథపాలెంలో 70 వేల చొప్పున కలిపి మొత్తం పది లక్షల మొక్కలు నాటనున్నారు. ఇవిగాక ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మరికొన్నింటిని నాటనున్నారు. ఇప్పటికే కురుస్తున్న చిరుజల్లులకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి అక్కడక్కడా మొక్కలు నాటడాన్ని ప్రారంభించారు. సోమవారం నాటికి పది లక్షల మొక్కల లక్ష్యంలో జిల్లా వ్యాప్తంగా 96,612 మొక్కలను నాటి పది శాతం లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఇక వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో 33 లక్షల మొక్కలు నాటనున్నారు.
ఖమ్మం నగరంలో..
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ)లో 5.84 లక్షల మొక్కలను నాటాలని అధికారులు నిర్ణయించారు. వీటి కోసం కేఎంసీలోని 26 డివిజన్లలో నర్సరీలను ఏర్పాటు చేశారు. వీటిలో పెంచుతున్న మొక్కల్లో 5.10 లక్షల మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేయాలని, మిగిలిన 74 వేల మొక్కలను ప్లాంటేషన్ చేయాలని నిర్ణయించారు. కేఎంసీ మేయర్ నీరజ ఇప్పటికే నగరంలో పర్యటిస్తూ ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేస్తున్నారు. అటవీ శాఖ ద్వారా ఈ ఏడాది 67 కిలో మీటర్ల పొడవున రోడ్డుకు ఇరువైపులా 7.74 లక్షల మొక్కలను నాటనున్నారు.