విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అటవీ అధికారికి కన్నీటి వీడ్కోలు పలికారు. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు అటవీప్రాంతంలో ఎఫ్ఆర్వో చలమల శ్రీనివాసరావును గొత్తి కోయలు దారుణంగా హత్య చేశారు. బుధవారం స్వగ్రామమైన ఖమ్మం జిల్లా ఈర్లపూడిలో అటవీ అధికారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వర రావు, ఎమ్మెల్సీ తాతా మధు, హరితహారం ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ఎం డోబ్రియల్, జిల్లా అధికారులు శ్రీనివాసరావు భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం మంత్రులు.. శ్రీనివాసరావు అంతిమ యాత్రలో పా ల్గొని పాడె మోశారు. పోలీసులు గౌరవ సూచికగా గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి వందనం సమర్పించారు. నిజాయితీ కలిగిన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న ఎఫ్ఆర్వోను కడసారి చూసేందుకు ప్రజలు, వివిధ జిల్లాల అటవీ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఖమ్మం, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అటవీ రక్షకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. విధి నిర్వహణలో భాగంగా గొత్తికోయల చేతిలో దారుణ హత్యకు గురైన ఎఫ్ఆర్వో చలమల శ్రీనివాసరావుకు ప్రభుత్వ లాంఛనాలతో ఆయన సొంత గ్రామమైన ఖమ్మం జిల్లా ఈర్లపూడిలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అంత్యక్రియలకు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, రాములునాయక్, ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొన్నారు. ముందుగా మంత్రులు ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని శ్రీనివాసరావు పాడె మోశారు. ‘జోహార్.. అటవీ రక్షకుడా..’ అంటూ వందనం సమర్పించారు. ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుమారుడు యశ్వంత్ దహన సంస్కారాలు నిర్వహించారు. నిబద్ధత కలిగిన అధికారిగా పేరొందిన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు దారుణ హత్యకు గురి కావడతో వరంగల్ జోన్ పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన ఫారెస్ట్ అధికారులు వందలాదిగా హాజరై అశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. ఈర్లపూడి గ్రామస్తులంతా అంతిమయాత్రకు తరలివచ్చారు. గౌరవ సూచికగా పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి వందన సమర్పణ చేశారు. శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
పాడె మోసిన మంత్రులు..
ఎఫ్ఆర్వో చలమల శ్రీనివాసరావు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఖమ్మం వచ్చారు. ఉదయం 11 గంటలకు ఈర్లపూడి గ్రామానికి చేరుకున్నారు. శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అతడి కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ధైర్యం చెప్పారు. అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు.
శోకసంద్రమైన ‘ఈర్లపూడి’
రఘునాథపాలెం, నవంబర్ 23: ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు మరణంతో ఈర్లపూడి గ్రామం శోకసంద్రమైంది. నిబద్ధత గల అధికారి హత్యను గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు. శ్రీనివాసరావు ఇంటి వద్దకు గ్రామస్తులు అధిక సంఖ్యలో చేరుకొని అతడి భౌతికకాయాన్ని సందర్శించి కంటతడి పెట్టారు. భర్త మరణంతో గుండెలవిసేలా రోదిస్తున్న భార్యను, తండ్రి ఇక లేడని తెలిసి తల్లడిల్లుతున్న అతడి బిడ్డలను ఓదార్చారు. శ్రీనివాసరావు అంతియయాత్ర, దహన సంస్కారాల్లో గ్రామస్తులంతా పాల్గొన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఎఫ్ఆర్వో కుటుంబానికి వద్దిరాజు రూ.2 లక్షల ఆర్థిక సాయం
ఖమ్మం, నవంబర్ 23: ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుటుంబానికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర బాసటగా నిలిచారు. కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. బుధవారం జరిగిన ఎఫ్ఆర్వో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మంత్రులతో కలిసి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన ఆయన.. ఈర్లపూడిలోని శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని అతడి భౌతికకాయానికి నివాళులర్పించారు. ప్రభుత్వం నుంచి అందించే సాయంతోపాటు వ్యక్తిగతంగా తాను కూడా బాధిత కుటుంబానికి అండగా నిలవాలని వద్దిరాజు భావించారు. మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, ఇంద్రకరణ్రెడ్డి చేతుల మీదుగా మృతుడి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల నగదును అందజేశారు. అనంతరం మంత్రులతో కలిసి శ్రీనివాసరావు పాడె మోసి అంతిమ వీడ్కోలు పలికారు.
ఉన్నతాధికారుల నివాళి..
ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు భౌతికకాయానికి నివాళులర్పించి అతడి అంతిమయాత్రలో పాల్గొన్న వారిలో హరితహారం ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ఎం డోబ్రియల్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, వైరా, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు రాములునాయక్, మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కోరం కనకయ్య, ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు, భద్రాద్రి ఎస్పీ వినీత్, ఖమ్మం ఏడీసీపీ డాక్టర్ శబరీశ్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు బానోతు చంద్రావతి, భద్రాద్రి డీఎఫ్వో లక్ష్మణ్ రంజిత్నాయక్, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆర్జేసీ కృష్ణ, గుత్తా రవికుమార్, మందడపు నర్సింహారావు, మందడపు సుధాకర్, పిన్ని కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.