ఖమ్మం/కొత్తగూడెం టౌన్, మార్చి 29 : క్రీస్తుకు సిలువ వేసే గుడ్ఫ్రైడే ప్రార్థనలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. లోక రక్షకుడైన క్రీస్తు.. సర్వ మానవపాప విముక్తి కోసం మరణ శిక్ష పొందిన రోజును శుభ శుక్రవారంగా పేర్కొంటూ క్రైస్తవ విశ్వాసులందరూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరుణామయుడు సిలువ మోసిన రోజును స్మరించారు. ఈ శుభ శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలతో రెండు జిల్లాల్లోని అన్ని క్రైస్తవ మందిరాలూ కిక్కిరిశాయి. మానవులు చేసిన పాపాలను తను మోస్తూ సిలువపై ప్రాణాలను అర్పించి త్యాగాన్ని చాటిన ఏసును స్తోత్రాలతో కీర్తించారు. సిలువ ధ్యానాన్ని పాటించారు. భక్తితో 40 రోజులపాటు ఉపవాస దీక్షలు ఆచరించిన విశ్వాసులు.. శుక్రవారం వాటి విరమణ చేశారు. సంప్రదాయం ప్రకారం పేదలకు దానం చేశారు. అనంతరం చర్చిలకు తరలివెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఖమ్మం ఆర్సీఎం చర్చి నుంచి నగర వీధుల్లో క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తు సిలువ మార్గ దృశ్యాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.
ప్రభువు నడిచిన పరిశుద్ధ సిలువ మార్గంలోని 14 స్థలాల్లో ఏసు భరించిన కష్టాలను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రభువు సిలువ మోసిన నేపథ్యం, ఏసు బోధనలు, సందేశాలు, వాక్యాలను మత పెద్దలు వినిపించారు. అధిక సంఖ్యలో విశ్వాసులు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసు ప్రభువు చూపిన మార్గాన్ని ఖమ్మం ఆర్సీఎం చర్చిలో ఫాదర్ బోధించారు. ఖమ్మం చర్చి కాంపౌండ్ సీఎస్ఐ చర్చిలో డోర్నకల్ బిషప్ పద్మారావు, రెవరెండ్ విశ్వంలు కూడా క్రీస్తు బోధనలు చాటారు. కరుణగిరి ఆర్సీఎంలో ఫాదర్లు గుడ్ఫ్రైడే ప్రాధాన్యాన్ని వివరించారు. కొత్తగూడెంలోని సీఎస్ఐ సెయింట్ ఆండ్రూస్ చర్చిలో పాస్టరేట్ చైర్మన్.. క్రీస్తుకు సిలువ వేసే ఇతివృత్తాన్ని వివరించారు. ఈ పండుగ దేవుడికి మానవుడికి, మానవుడికి మానవుడికి గల ప్రేమ సంబంధాన్ని చాటుతుందని అన్నారు. జీవితంలో మానవులు పాపాలను చేయకుండా ఉండాలని, ప్రేమతో జీవించాలని, దేవుడి మార్గాన్ని ఎంచుకోవాలని ఉపదేశించారు. బైబిల్ వాక్యాలను పఠించారు.