కరెంట్ కష్టాలను అధిగమించేందుకు రాష్ట్రం ప్రభుత్వం సౌర విద్యుత్ వినియోగంపై దృష్టి సారించింది. ఇందుకు స్వయం సహాయక సంఘాలను ఎంపిక చేసి యూనిట్లు మంజూరు చేసేందుకు శ్రీకారం చుట్టింది. స్త్రీనిధి నుంచి సబ్సిడీ పోను మిగతా నగదును రుణంగా అందించనుంది. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు 600 యూనిట్లు కేటాయించింది. ఇచ్చిన రుణాన్ని 5 ఏళ్లలోపు చెల్లించుకునేలా కాలపరిమితిని ప్రకటించింది. 25 ఏళ్లపాటు ఉచిత విద్యుత్ను పొందడమే కాకుండా మిగులు విద్యుత్ను గ్రిడ్కు విక్రయించి ఆదాయం పొందేవిధంగా యూనిట్లను రూపొందించింది. దీనిపై స్త్రీనిధి కో ఆపరేటివ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సెర్ప్ అధికారులు ఆసక్తి గల ఎస్హెచ్జీ సభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
– అశ్వారావుపేట, జనవరి 27
అశ్వారావుపేట, జనవరి 27: విద్యుత్ వినియోగం పెరగడంతో అందుకు వెచ్చించాల్సిన వ్యయం అధికకమవుతోంది. సాధారణ, మధ్య తరగతి ప్రజలందరూ ఏసీలతోపాటు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మిక్సీలు, గ్రైండర్లను వాడుతున్నారు. ఫలితంగా విద్యుత్ బిల్లులు ఎక్కువ రావడంతో చెల్లింపు కష్టతరంగా మారింది. సామాన్య ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గృహాలపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సబ్సిడీని అందించడంతోపాటు మిగతా పెట్టుబడిని స్త్రీనిధి ద్వారా రుణంగా అందించాలని నిర్ణయించింది. విద్యుత్ బిల్లుల భారాన్ని కొంతమంతిపైనైనా తగ్గించాలని రాష్ట్రంలో విజయవంతంగా నడుస్తున్న స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్సీ)ను మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేసింది. వీరికీ ఇప్పటికే స్వయం ఉపాధి కోసం బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్న ప్రభుత్వం.. సోలార్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకూ ప్రత్యేకంగా రుణాలు అందించాలని ప్రణాళిక రూపొందించింది.
మండలానికి 35 యూనిట్లు..
పైలట్ ప్రాజెక్టు కింద భద్రాద్రి జిల్లాలో మణుగూరు మున్సిపాలిటీతోపాటు మరో 10 మండలాలను సోలార్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల మంజూరుకు స్త్రీనిధి కో ఆపరేటివ్ ఎంపిక చేశారు. వీటితో ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, భద్రాచలం, దుమ్ముగూడెం, గుండాల, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, పినపాక, సుజాతనగర్ మండలాలను ఎంపిక చేస్తూ కో ఆపరేటివ్ మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్రెడ్డి డిసెంబర్ 24న ఉత్తర్యులు జారీ చేశారు. జిల్లాలో 1,200 మంది సోలార్ విద్యుత్ యూనిట్ల మంజూరుకు అర్హత కలిగి ఉన్నారు. మొదటి విడతలో 600 యూనిట్లు మంజూరు చేసి వీటిలో 385 యూనిట్లకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కువమంది ముందుకొచ్చినా మంజూరు చేయాలని అధికారులు నిర్ణయించారు.
టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో యూనిట్లు..
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని టీఎస్ రెడ్కో (రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ) సహకారంతో ఇండ్లపై ఫైనాన్సింగ్ గ్రిడ్ కనెక్టెడ్ రూఫ్ టాప్ (జీసీఆర్టీ) సోలార్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ప్రతి ఇంటికీ 2 లేదా 3 కిలోవాల్ట్స్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటే ప్రతి రోజూ 2 నుంచి 12 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలంటే 2 కిలో వాల్ట్స్ యూనిట్కు రూ.1,42,200, 3 కిలో వాల్ట్స్ యూనిట్కు రూ.1,92,360 ఖర్చు అవుతుంది. 2 కిలోవాల్ట్స్ యూనిట్కు ప్రభుత్వం రూ.39,200, 3 కిలో వాల్ట్స్ యూనిట్కు రూ.57,360 చొప్పున ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుంది. మిగతా మొత్తాన్ని లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది.
ఇంత మొత్తంలో ఖర్చును భరించటానికి వినియోగదారులెవ్వరూ ముందుకు రాకపోవడంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు వెనుకబడింది. దీనిని గమనించిన ప్రభుత్వం ముందుగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలపై యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ఖర్చును సబ్సిడీ పోను మిగతా సొమ్మును స్త్రీనిధి నుంచి అందించాలని స్త్రీనిధి బ్యాంకును ఆదేశించింది. జిల్లాల వారీగా టార్గెట్లను నిర్దేశించింది. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)కు అప్పగించింది.
మిగులు విద్యుత్ను విక్రయించుకోవచ్చు..
రూఫ్ టాప్ సోలార్ పవర్ యూనిట్ను ఇంటిపై ఏర్పాటు చేసుకుంటే 25 ఏళ్ల వరకు విద్యుత్ బిల్లుల భారం తప్పుతుంది. యూనిట్ పరికరాలకు 25 ఏళ్ల వరకు గ్యారంటీ ఉంటుంది. 2 కిలో వాల్ట్స్ యూనిట్ను ఏర్పాటు చేసుకుంటే రోజూ 2 నుంచి 12 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. గృహ వినియోగానికి పోను ఇంకా విద్యుత్ మిగిలితే దీనిని గ్రిడ్కు విక్రయించుకోవచ్చు. ఇలా గ్రిడ్కు వెళ్లిన ప్రతి యూనిట్కు రూ.4.20 చొప్పున లభిస్తాయి. 160 నుంచి 200 చదరపు మీటర్ల వెడల్పు ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరికీ యూనిట్ మంజూరవుతుంది. ఇల్లు సంఘం సభ్యురాలి కుటుంబ సభ్యుల పేరున ఉంటే సరిపోతుంది.
ప్రభుత్వ రాయితీ పోను మిగతా సొమ్మును లబ్ధిదారుల నామామాత్రపు వాటాతో స్త్రీనిధి నుంచి రుణంగా అందిస్తుంది. 2 కేవీ (కిలో వాల్ట్స్) యూనిట్కు సబ్సిడీ పోను రూ.1.03 లక్షలకు స్త్రీనిధి రూ.లక్ష రుణంగా అందిస్తుంది. మిగతా రూ.3 వేలు లబ్ధిదారులు చెల్లిస్తే సరిపోతుంది. అదే 3 కిలోవాల్ట్స్ యూనిట్కు రూ.10 వేలు లబ్ధిదారులు చెల్లించాలి. 2 కిలోవాల్ట్స్కు రూ.లక్ష, 3 కిలోవాల్ట్స్కు రూ.1.25 లక్షలు చొప్పున రుణం ఇస్తారు. ఈ రుణాన్ని 11 శాతం వడ్డీతో 60 నెలల్లో చెల్లించాలి. రూ.లక్ష రుణానికి నెల వాయిదా రూ.2,243, రూ.1.25 లక్షల రుణానికి రూ.2,803 ప్రతి నెలా కిస్తీ చెల్లించాలి.
దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం..
రాయితీపై సోలార్ విద్యుత్ యూనిట్లను ప్రభుత్వం ఎస్హెచ్జీ సభ్యులకు మంజూరు చేస్తోంది. ఆసక్తిగల సభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన ఖర్చును స్త్రీనిధి నుంచి రుణంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రుణాన్ని నిర్ణీత వడ్డీతో నెలవారీగా వాయిదాలుగా 5 ఏళ్లలోపు చెల్లించాలి.
– వెంకటేశ్వర్రెడ్డి, సెర్ప్ ఏపీఎం, అశ్వారావుపేట
పర్యావరణ పరిరక్షణకు దోహదం..
సోలార్ విద్యుత్ యూనిట్లు పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడతాయి. అంతేకాకుండా విద్యుత్ బిల్లుల భారం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఉత్పత్తి అయ్యే విద్యుత్లో వినియోగం గృమ పోను మిగతా విద్యుత్ను గ్రిడ్కు విక్రయించుకోవచ్చు. ఇందుకు ప్రభుత్వం నిర్ణయించిన ధర వినియోగదారులకు చెల్లిస్తాం. ఇది వినియోగదారులకు అదనపు ఆదాయం. ఒక్కసారి యూనిట్కు ఖర్చు వెచ్చిస్తే 25 ఏళ్లపాటు బిల్లుల భారం ఉండదు. అదనపు ఆదాయం లభిస్తుంది.
-బసవ వెంకటేశ్వర్లు, డిస్కం ఏడీఈ, అశ్వారావుపేట