టేకులపల్లి, నవంబర్ 26: విద్యార్థి దశలో ఉన్న పిల్లల్లో సృజనాత్మక ఆలోచనలకు సైన్స్ఫెయిర్ వంటి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇల్లెందు సింగరేణి ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా కొనసాగుతున్న సైన్స్ఫెయిర్ ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి మాట్లాడారు. వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా పిల్లల్లో సరికొత్త ఆలోచనలు అంకురిస్తాయని అన్నారు.
తెలంగాణలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ యువకులు చేస్తున్న స్కైరూట్, ధ్రువ స్పేస్ ప్రయోగాలు కూడా దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నాయని గుర్తుచేశారు. మహబూబాబాద్, ఖమ్మం ఎంపీలు మాలోత్ కవిత, నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ చిన్న వయస్సులో పిల్లల ఆసక్తిని గమనించి వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.
ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ మాట్లాడుతూ జిల్లాస్థాయి సైన్స్ఫేర్ను తొలిసారిగా ఇల్లెందులో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలో గతంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనల్లో రానన్ని ఎగ్జిబిట్లు ఈ సైన్స్ఫెయిర్కు వచ్చాయని వివరించారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. చిన్న వయసు నుంచే సైన్స్పై ఎంత ఆసక్తి పెంచుకుంటే భవిష్యత్లో అంత గొప్పవారు అవుతారని వివరించారు.
అనంతరం చంద్రుగొండ జడ్పీహెచ్ఎస్ విద్యార్థి సూర్యప్రకాశ్కు ప్రథమ బహుమతి, పోకలగూడెం జడ్పీఎస్ఎస్ విద్యార్థి బీ.యశ్వంత్కు ద్వితీయ బహుమతి, ఇల్లెందు సింగరేణి ఎయిడెడ్ పాఠశాల విద్యార్థిని ఎం.మనస్వినికి తృతీయ బహుమతి బహూకరించారు. మొత్తం నాలుగు విభాగాల్లో 30 మంది విద్యార్థులకు కూడా బహుమతులు ప్రదానం చేశారు.
సింగరేణి హైస్కూల్లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలను మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మహబూబాబాద్ ఎంపీ కవిత, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్, కలెక్టర్ అనుదీప్ వీక్షించారు. ఎగ్జిబిట్లను పరిశీలించి బాల మేధావులతో ముచ్చటించి వివరాలు తెలుసుకున్నారు. నూతన ప్రదర్శనలు ఆవిష్కరించిన వారిని అభినందించారు.
ఏజెన్సీ ప్రాంతమైన ఇల్లెందులో ఏర్పాటు చేసిన సైన్స్ఫెయిర్లో జిల్లాలోని 674 పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లలు, ఉపాధ్యాయులకు మూడు రోజుల్లో సుమారు ఎనిమిది వేల మందికి భోజనం, టిఫిన్ వంటి సౌకర్యాలను ఎమ్మెల్యే హరిప్రియ, హరిసింగ్నాయక్ దంపతులు సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జానీ, డీఈవో సోమశేఖరశర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.