భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో భూ సేకరణ ప్రక్రియపై రెవెన్యూ, సర్వే ల్యాండ్ అండ్ రికార్డ్స్, ఇరిగేషన్, సింగరేణి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ మూడు దశల ప్రాజెక్టులకు భూసేకరణ, పులుసుబొంత ప్రాజెక్టు, బీటీపీఎస్ రైల్వే లైన్, మణుగూరు, కరకగూడెం గ్రామాల ఆర్అండ్ఆర్ తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీతారామ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టు భూసేకరణలో పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు, తదితర సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పులుసుబొంత ప్రాజెక్టు భూసేకరణకు సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించి వారం రోజుల్లో ఆర్డీవోకు నివేదిక అందజేయాలని కరకగూడెం తహసీల్దార్ను ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో రవీంద్రనాథ్, బీటీపీఎస్ సీఈ బిచ్చన్న, ఇరిగేషన్ ఈఈ అర్జున్, ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రమేశ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, నేషనల్ హైవే ఈఈ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు పాల్గొన్నారు.