భద్రాచలం, ఏప్రిల్ 7: భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం ధ్వజపట భద్రక మండల లేఖనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక జీయర్ మఠంలో తెల్లని వస్త్రంపై గరుత్మంతుడి చిత్రాన్ని చిత్రీకరించారు. తరువాత మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అంతరాలయంలోని మూలమూర్తుల వద్దకు గరుడ పటాన్ని తీసుకెళ్లారు. తెలిసీ తెలియక చిత్రలేఖనంలో ఏమైనా దోషాలుంటే వాటిని తొలగించి అనుజ్ఞ ఇవ్వాలని రామయ్యను ప్రార్థించారు. శుక్రవారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అనంతరం యాగశాలకు ధ్వజపటాన్ని తీసుకెళ్లి గరుడాధివాసం కార్యక్రమాలు నిర్వహించారు. గరుత్మంతుడి చిత్రపటానికి హారతులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గరుత్మంతుడి చిత్రపటాన్ని చిత్రీకరించిన కోమండూరి రఘునాథాచార్యులను పట్టు వస్త్రంతో సత్కరించారు. దేవస్థానం ఈవో శివాజీ, ఏఈవో శ్రావణ్కుమార్, ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, ఉప ప్రధానార్చకులు అమరవాది వెంకట శ్రీనివాస రామానుజం, ముఖ్య అర్చకులు అమరవాది మధుసూదనాచార్యులు, మురళీకృష్ణమాచార్యులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సకల రాజలాంఛనాలతో ధ్వజ స్తంభం వద్దకు గరుడపటాన్ని తీసుకొచ్చి ధ్వజారోహణం చేస్తారు. అగ్ని ప్రతిష్ఠ, చతుఃస్థానార్చన నిర్వహించనున్నారు. ఈ నెల 10న జరిగే రామయ్య కల్యాణానికి మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తయారుచేసి కల్యాణ వేదికను సిద్ధం చేశారు.
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో రామభక్తులు 2వేల శ్రీరామ ధ్వజాలను (జెండాలను) ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. భద్రాచలంలోని ప్రతి ఇంటిమీద రామధ్వజం ఎగురవేయాలనే ఉద్దేశంతో ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చిట్లూరి వాసు, కోనా ఆనంద్కుమార్ తెలిపారు. అందులో భాగంగా గురువారం దేవస్థానం ఈవో శివాజీ చేతుల మీదుగా శ్రీరామ ధ్వజాలను ఆవిష్కరించారు. ప్రధాన ఆలయం, కల్యాణ మండపంలో కట్టేందుకు 250 శ్రీరామ ధ్వజాలను ఈవోకు అందజేశారు. ఏఈవో శ్రావణ్కుమార్, అనిల్ పాల్గొన్నారు.