భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి తొలిదశ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశామని భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. మంగళవారం ఐడీవోసీ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో కలిసి ఎన్ఐసీ రూపొందించిన సాఫ్ట్వేర్ను వినియోగిస్తూ ఆన్లైన్లో పోలింగ్ సిబ్బందికి తొలిదశ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 962 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 9 యాక్సిలరీ పోలింగ్ స్టేషన్ల కోసం ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల అధికారికి పంపించామన్నారు. మొదటి ర్యాండమైజేషన్లో భాగంగా 1,401 ప్రిసైడింగ్, 1,401 సహాయక ప్రిసైడింగ్ అధికారులు, 2,827 ఓపీవోలను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అదనంగా సిబ్బంది కేటాయింపు ప్రక్రియను చేపట్టామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎలక్షన్ సూపరింటెండెంట్ దారా ప్రసాద్, రంగా ప్రసాద్, ఎన్ఐసీ డీఐవో సుశీల్కుమార్, డీఎల్ఎంటీ పి.సాయికృష్ణ, ఎన్నికల సిబ్బంది నవీన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.