ఖమ్మం, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్ చేతివృత్తుదారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నా రు. వారి కోసం సంక్షేమ పథకాలు అమ లు చేస్తున్నారు. శ్రమజీవులకు వారికి ఆసక్తి ఉన్న రంగాలు, ఆ వృత్తిలో అనుభవాన్ని బట్టి రాయితీపై రుణాలు అందించి యూనిట్లు నెలకొల్పేలా ప్రోత్సహిస్తున్నారు. దీనిలో భాగంగా 2018 -21 వరకు ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకున్న మండల స్థాయిలో లాటరీ ద్వారా ఎంపిక చేసి రుణాలు అందిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాల పొందేవారి జాబితా ఇప్పటికే సిద్ధమైంది. ఆ జాబితా ప్రకారం అధికారులు యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయనున్నారు.
జిల్లాలో ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ యువతకు 50 శాతం నుంచి 80 శాతం రాయితీపై రుణాలు అందిస్తున్నది. వృత్తి నైపుణ్యం ఉన్నవారికి ఆయా రంగాల్లో వారి ప్రతిభను గుర్తించి రుణాలు మంజూరు చేస్తున్నది. జిల్లావ్యాప్తంగా ఎంపికైన లభ్ధిదారులకు యూనిట్లకు గ్రౌండింగ్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సర్కార్ 2018-19లో బ్యాంక్ లింకేజీ లేకుండా 560 మందిని క్యాష్ రుణాలకు ఎంపిక చేసి వారి ఖాతాల్లో రూ.2.80 కోట్లు, శాశ్వత ప్రాతిపదికన కూరగాయల పందిళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 110 మందికి బ్యాంక్ లింకేజీతో రూ.1.66 కోట్లు, నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని యూనిట్లకు ఎంపికైన 677 మందికి రూ.10 కోట్లు మంజూరు చేసింది.
2020-21లో జోడు పాడి గేదెల కోసం బ్యాంక్ లింకేజీ ద్వారా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 150 మంది, మధిర నియోజకవర్గం నుంచి 150 మందిని ఎంపిక చేసి రూ.4.20 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. నైపుణ్యం లేని, నైపుణ్యం ఉన్న యూనిట్లకు ఎంపిక చేసిన 585 మంది లభ్ధిదారులకు రూ.11.39 కోట్లు మంజూరయ్యాయి. ఇలా జిల్లావ్యాప్తంగా 2,232 మందికి రూ.30.94 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. 2022-23లో లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక మార్గదర్శకాలు విడుదల చేసింది.
నిబంధనల మేరకు రుణాలు..
ప్రభుత్వం నిధుల మేరకు యూనిట్ల గ్రౌండింగ్కు చర్యలు తీసుకుంటున్నాం. మార్గదర్శకాలకు అనుగుణంగా లభ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఇప్పటికే జాబితా సిద్ధం చేశాం. బ్యాంకుల ద్వారా లబ్ధిదారుల యూనిట్లకు రాయితీని వారి ఖాతాలో జమ చేస్తాం. బ్యాంక్ లింకేజీ లేని రుణాలను నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తాం.
– ఏలూరి శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, ఖమ్మం