కొత్తగూడెం క్రైం, ఫిబ్రవరి 24: ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని.. మోసాలకు పాల్పడుతున్న నకిలీ నోట్ల ముఠాను కొత్తగూడెం ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెం పట్టణంలో డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్ ముఠా వివరాలను వెల్లడించారు. కొత్తగూడెం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ నేతృత్వంలో గురువారం సాయంత్రం ఎస్సై టి.లచ్చయ్య తన సిబ్బందితో బస్టాండ్ సెంటర్లో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి కారు దిగి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని పోలీసులు విచారించారు. జూలూరుపాడు మండలం కొమ్ముగూడేనికి చెందిన బానోతు భోజ్యానాయక్, ఖమ్మం జిల్లా వేంసూరు మండలానికి చెందిన తనమళ్ల రాజశేఖర్, కొత్తగూడెం బాబూక్యాంపునకు చెందిన జలమని భాస్కర్, చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీకి చెందిన పున్నం ప్రసాద్ అలియాస్ వర్మ (కారు యజమాని), ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమలంకకు చెందిన బీరేవెల్లి రాంబాబుగా గుర్తించారు. వీరంతా ముఠాగా ఏర్పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో ప్రజలను నకిలీనోట్లతో మోసం చేయడమే లక్ష్యంగా ఎంచుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
అందుకోసం రద్దీగా ఉండే సంతలు, కూరగాయల మార్కెట్లు వంటి ప్రాంతాలను ఎంచుకుని జనాలను నమ్మించి నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను మోసం చేసేందుకు కొత్తగూడెం పట్టణానికి చేరుకుని టీ తాగేందుకు బస్టాండ్ వైపు వచ్చారు. ఇంతలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి కారు యజమాని ప్రసాద్ పారిపోయాడు. మిగిలిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపి దొంగనోట్లపై కూపీ లాగారు. ఆ వ్యక్తుల వద్ద నుంచి కారుతోపాటు రూ.3 లక్షల అసలు నగదు నోట్లు, దొంగనోట్లు తయారు చేసేందుకు వినియోగించే నల్ల కాగితాల బండిల్స్, నకిలీ నోట్లకు వినియోగించే యాసిడ్ బాటిళ్లు, చిన్నారులు ఆడుకోడానికి ఉపయోగించే నకిలీ రూ.500 నోట్లు స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. ఎవరైనా నకిలీ నోట్లు తయారు చేసినా, అమ్మడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కేసును గంటల వ్యవధిలోనే ఛేదించిన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ, ఎస్సై లచ్చయ్య, హెచ్సీలు వెంకటేశ్వర్లు, ఘని, పీసీలు సురేశ్, వీరన్న, కామేశ్ను డీఎస్పీ అభినందించారు.