ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 23 : దేశవ్యాప్తంగా ఎన్టీఏ ఆధ్వర్యంలో జాయింట్ ఎంట్రన్స్ టెస్ట్(జేఈఈ) మెయిన్-2024 పరీక్షను బుధవారం నుంచి ఆన్లైన్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ఆరు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు ఇక్కడికి రానున్నారు. గత అనుభవాల దృష్ట్యా అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. జేఈఈ ఎంట్రన్స్ రెండు సెషన్స్లో నిర్వహిస్తున్నారు. మొదటి సెషన్లో పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్లో పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ నెల 24న బీఆర్క్ మొదటి విడత పరీక్షకు 1,071 మంది అభ్యర్థులు, ఈ నెల 27, 29, 30, 31, ఫిబ్రవరి ఒకటో తేదీల్లో జేఈఈ మెయిన్ మొదటి విడతకు 7,960 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు పరీక్షల జిల్లా కో-ఆర్డినేటర్ రామసహాయం పార్వతీరెడ్డి తెలిపారు. పరీక్ష నిర్వహించే కేంద్రాల్లో అరగంట ముందే గేట్లు మూసివేస్తారని, గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలనే నిబంధనను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
నగరంలోని బొమ్మ ఇంజినీరింగ్ కళాశాల, శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాల, ఎస్బీఐటీ ఇంజినీరింగ్ కళాశాల, విజయ ఇంజినీరింగ్ కళాశాల, కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల, ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాలుగా పరీక్షలు నిర్వహించనున్నారు.
అభ్యర్థులకు సూచనలు
ప్రభుత్వ గుర్తింపు కార్డుతో బొటన వేలిముద్ర అనుసంధానంతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అనంతరం కంప్యూటర్ను కేటాయించనున్నారు.
ప్రభుత్వ గుర్తింపు కార్డు, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, ట్రాన్సరెంట్ పెన్, అడ్మిట్ కార్డుతో హాజరుకావాలి.
పరీక్ష అనంతరం రఫ్ బుక్లెట్ను డ్రాప్ బాక్స్లో వేయాలి.