భద్రాద్రి కొత్తగూడెం, జూలై 27 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి మన్యానికి ఏటా వరద గుబులు తప్పడం లేదు. ఎక్కడ వానలు కురిసి వరద పొంగినా చివరికి భద్రాద్రి ఏజెన్సీకి ముంపు కష్టాలు తప్పవు. ప్రతి వానకాలం సీజన్లో జూలై, ఆగస్టు వచ్చిందంటే చాలు అక్కడి ప్రజలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. అసలే అది గిరిజన జిల్లా. ఎక్కువ మంది గిరిజన కుటుంబాలే జీవనం సాగిస్తుంటారు. ఇది ఇప్పటి సమస్య కాదు.. ఏళ్లకాలం నుంచి గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న మధ్యతరగతి వారికి వరద కష్టాలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనికి తోడు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు మంజూరు చేయడం.. దానికి అనుమతులు రావడంతో డ్యామ్ కోసం పనులు ప్రారంభించారు. దీంతో రెండేళ్ల నుంచి వరద వచ్చినప్పుడల్లా డ్యాం బ్యాక్వాటర్ వల్ల మరింత ముప్పు తెచ్చిపెడుతున్నది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పూర్వ మండలాలతోపాటు భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, అశ్వాపురం, బూర్గంపాడు, సారపాక, మణుగూరు ప్రాంతాలకు ముంపు తప్పడం లేదు. అటు అధికార యంత్రాంగం, పాలకులకు కష్టాలు తప్పడం లేదు. యంత్రాంగం కష్టపడి పనిచేసినా నిర్వాసితులకు అండగా ఉండి ప్రాణహాని జరుగకుండా చూడటమే తప్ప ప్రకృతి వైపరీత్యాల నుంచి పూర్తిగా విముక్తి చేయడం ఎవరితరం కాదనే చెప్పాలి.
సీజన్ వస్తే సామాన్లు సర్దాల్సిందే..
వానకాలం సీజన్ వచ్చిందంటే తట్టాబుట్ట సర్దుకొని ఎత్తు ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి. ఎందుకంటే.. అన్ని గ్రామాలు నదీ పరీవాహక ప్రాంతంలోనే ఉండడం వల్ల ఈ పరిస్థితి. ఉండడానికి ఖరీదైన భవన నిర్మాణాలు చేసుకున్నా సీజన్లో ఇంట్లో ఉన్న సామాన్లు తరలించాల్సిందే. దీనివల్ల ఏటా ఎన్నో కొన్ని విలువైన సామాన్లు వాన కు తడిసి, వరదలో మునిగి జనజీవనానికి నష్టాన్ని మిగుల్చుతున్నాయి. ఎవరూ జరిగిన నష్టాన్ని పూడ్చలేరనేది అందరికీ తెలిసిందే. గోదావరి నదీ ప్రవాహక ప్రాంతం చివరిలో ఉండడమే ఇక్కడి ప్రజలు చేసుకున్న పాపమా అంటే అవుననే సమాధానం రాకమానదు.
ఎక్కడ వరదొచ్చినా ఇక్కడ మునగాల్సిందే..
గోదావరి నది దేశంలో గంగా, సింధూ నదుల తర్వాత అతి పొడవైన నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర త్రయంబకంలో అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో పుట్టింది. నిజామాబాద్ జిల్లా రేంజర్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. తర్వాత ఆదిలాబాద్, కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల మీదుగా ములుగు, భూపాలపల్లి జిల్లాల గుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం పవిత్ర పుణ్యక్షేత్రం మీదుగా ఆంధ్రా ప్రాంతానికి వెళ్తుంది. దీనివల్ల పైనుంచి ఎక్కడ వరద వచ్చినా ఈ జిల్లాలో ఉన్న ప్రాంతాలు.. అదీ చివరిగా ఉన్న భద్రాచలం నియోజకవర్గంతోపాటు పినపాక నియోజకవర్గంలో మండలాలు ముంపునకు గురవుతున్నాయి. ఇది చివరిగా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతుంది. నది పొడవు మొత్తం 1,465 కిలోమీటర్లు. గోదావరిపై ఇప్పటివరకు 12 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో ఎగువ భాగాన ఉన్న ప్రాజెక్టులోకి చేరిన వరద నీరు కిందకు వదిలితే భద్రాచలం వద్ద ఉధృతి పెరిగి ముంపునకు గురవుతుంది. నదులు పొంగినా, ప్రాజెక్టుల్లో నీరు వ దిలినా చివరికి ముంపునకు గురయ్యేది భ ద్రాద్రి జిల్లాలో ముంపు గ్రామాలే కావడం వల్ల ఏటా వరద కష్టాలు తప్పడం లేదు.
1976 నుంచి వరదల రికార్డు..
గోదావరి వరదలు వందల సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాయి. కానీ.. 1976 నుంచి మాత్రం అధికారులు వరద లెక్కలను అంచనా వేశారు. 1976లో 63.9 అడుగులు వచ్చిన వరద అప్పుడే అది పెద్దవరద అనుకుని జనం బెంబేలెత్తిపోయారు. కానీ.. క్రమక్రమంగా ఏటా వరదలు రావడం.. ప్రజలు కష్టాలు పడడం పరిపాటి అయింది. 1976 నుంచి వరదల లెక్కలు అంచనా వేస్తే 60 అడుగులు మించి వచ్చిన గోదావరి వరదే రికార్డు స్థాయిగా చెప్పుకుంటున్నారు. 1983లో 63.5 అడుగులు, 1986లో అత్యధికంగా 75.6 అడుగులు వచ్చి వరద రికార్డు సృష్టించింది. దాని తర్వాత 2006లో 66.9, 2010లో 59.7, 2013లో 61.6 అడుగులు వచ్చింది. తర్వాత 2022లో అత్యధికంగా 72.3 అడుగులు వచ్చినా.. 1986 వరదల లెక్కను మించి ముంపు జరిగింది. కానీ.. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగారంటే అది తెలంగాణ ప్రభుత్వం చేసిన ముందస్తు చర్యలేనని చెప్పక తప్పదు. అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు సమష్టిగా పనిచేసి బాధితులకు అండగా నిలిచారు.
అధికారులకు వరదలు సవాలే..
అధికారులు, ఉద్యోగులు భద్రాచలం నియోజకవర్గంలో పని చేయాలంటే చాలా మారుమూల ప్రాంతంగా భావించేవారు. కానీ.. రానురాను తెలంగాణ వచ్చాక అన్ని మండలాలకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో పనిచేసే ఉద్యోగులు సంతోషంగా పనిచేసే అవకాశం కలిగింది. కానీ.. ఏటా ఉద్యోగులకు వరదలు ఒక సవాల్గా నిలుస్తున్నాయి. ఇక్కడ పనిచేసిన ఉద్యోగులు ఎక్కడైనా పని చేసేందుకు సై అంటున్నారంటే అక్కడ అనుభవం చాలా గొప్పదిగా చెప్పుకోవచ్చు. మన్యంలో పనిచేయడం ఒక సవాల్ అని చెప్పాలి.