భద్రాద్రి కొత్తగూడెం, మే 26 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి వరంగల్ – ఖమ్మం – నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భద్రాద్రి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 55 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఓటింగ్ జరుగనుంది. ఈ మేరకు సామగ్రి పంపిణీ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రిని తీసుకొని ఎన్నికల సిబ్బంది ఆదివారం సాయంత్రానికే తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. లక్ష్మీదేవిపల్లి శ్రీరామచంద్రా డిగ్రీ కాలేజీలో మెటీరియల్ పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ ప్రియాంక పరిశీలించి ఎన్నికల సిబ్బందికి మెటీరియల్ను అందజేశారు. 65 మంది పీవోలు, 65 మంది ఏపీఓలు, 152 మంది ఓపీవోలు కలిపి మొత్తం 282 మంది సిబ్బంది ఈ విధుల్లో పాల్గొంటున్నారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఓటు హక్కు నమోదు చేసుకున్న పట్టభద్రులు మొత్తం 40,106 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 22,590, మహిళలు 17,516 మంది ఉన్నారు. అత్యధికంగా చుంచుపల్లి మండలం బాబూక్యాంపు 271వ బూత్లో 1145 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే 252 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సోమవారం నాటి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే జరుగుతుందని కలెక్టర్ ప్రియాంక తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలం రామచంద్రా కాలేజీలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద నిర్వహించాల్సిన విధుల గురించి ఎన్నికల అధికారులకు, సిబ్బందికి మరోసారి వివరించారు. సామగ్రిని భద్రత మధ్య వాహనాల్లో తీసుకెళ్లాలని సూచించారు. పోలింగ్ అయ్యాక తిరిగి ఇదే రిసెప్షన్ సెంటర్కు రావాల్సి ఉంటుందన్నారు. అనంతరం వాహనాలకు ఏర్పాటు చేసిన ట్రాకింగ్ సిస్టమ్ను కూడా పరిశీలించారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఆర్డీవోలు మధు, దామోదర్, తహసీల్దార్ పుల్లయ్య, ఎన్నికల అధికారులు దారా ప్రసాద్, రంగాప్రసాద్, సుశీల్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.