ఖమ్మం, డిసెంబర్ 20: సర్వమతాల సమానత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. దేశంలో ఎకడా లేని విధంగా తెలంగాణలో అన్ని పండుగలనూ ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తోందన్నారు. క్రిస్మస్ సందర్భంగా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే వేడుకల్లో పాల్గొని క్రైస్తవులకు అండదండలుగా నిలుస్తున్నారని గుర్తుచేశారు. క్రిస్మస్ సందర్భంగా రాష్ట్రంలోని పేద క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన క్రిస్మస్ కానుకల పంపిణీని ఖమ్మం జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఖమ్మం సహకారనగర్లోని బర్నికల్ బాప్టిస్ట్, రోటరీనగర్ గుడ్ షెపర్డ్, కొత్తగూడెంలోని దైవకృప మందిరం, శ్రీనివాసనగర్లోని మాంట్ఫోర్ట్ చర్చీల్లో పేద క్రైస్తవులకు ఆయన క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసి మాట్లాడారు. నిరుపేద క్రైస్తవులు కూడా పండుగను అందరితో సమానంగా ఆనందంగా జరుపుకొనేందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ క్రిస్మస్ కానుకలను పంపిస్తోందని అన్నారు. అన్ని మతాల ప్రజల కోసం రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదని గుర్తుచేశారు. అన్ని కులాలకు, అన్ని మతాలకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తోందని వివరించారు.
క్రైస్తవుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించి నిధులు మంజూరు చేసిందని గుర్తుచేశారు. జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి రెండు వేల చొప్పున కిట్లను అందిస్తుండగా.. ఖమ్మం నియోజకవర్గంలో మాత్రం ఐదు వేల కిట్లును పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్కుమార్, కార్పొరేటర్లు పగడాల శ్రీవిద్య, రావూరి కరుణ, జాన్బీ, ఎర్రా గోపి, తహసీల్దార్ శైలజ, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.