పాల్వంచ రూరల్, డిసెంబర్ 1: చదువుతోపాటు క్రీడల్లోనూ నైపుణ్యం సాధించి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చునని భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య పేర్కొన్నారు. పాల్వంచ మండలం కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో గురువారం జరిగిన గురుకులాల ఆరో ఇంటర్ సొసైటీ లీగ్ క్రీడల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. భద్రాద్రి జిల్లాలోని మారుమూలలో ఉన్న కిన్నెరసానిలో ఐటీడీఏ పీవో గౌతమ్ ప్రత్యేక చొరవతో గురుకులాల ఆరో ఇంటర్ సొసైటీ క్రీడలను ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
రానున్న కాలంలో ఈ ప్రాంతం క్రీడల నిర్వహణకు ప్రముఖ కేంద్రం కానుందన్నారు. ఇలాంటి క్రీడల వల్ల విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుందని అన్నారు. విద్యార్థులు కూడా చదువుతోపాటు తమకు ఇష్టమైన క్రీడలనూ సాధన చేయాలని, వాటిల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడినవారు నిరుత్సాహపడకుండా పొరపాట్లు గమనించి మరోసారి విజయం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఓవరాల్ చాంపియన్ జట్లకు కప్లు, ప్రశంసాపత్రాలను అందించారు. స్టేట్ స్పోర్ట్స్ ఆఫీసర్ సోమేశ్, ట్రైబల్ వెల్పేర్ డీడీ రమాదేవి, రామలక్ష్మణ్, రవికుమార్, అరుణ, పార్థసారథి, లతీఫ్, తి రుపతి ప్రసాద్, రాంలాల్ పాల్గొన్నారు.
గత నెల 28న ప్రారంభమైన ఆరో ఇంటర్ సొసైటీ లీగ్ క్రీడలు గురువారం ముగిశాయి. రాష్ట్రంలోని ఏడు గురుకుల సొసైటీల నుంచి దాదాపు 3,200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, ఆర్చరీ, రన్నింగ్, హాకీ, హ్యాండ్బాల్, బాక్సింగ్, రెజ్లింగ్, షాట్పుట్, జావెలిన్త్రో తదితర క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో అన్ని విభాగాల్లో సోషల్ వెల్ఫేర్ జట్టు ప్రతిభ చూపి 350 పాయింట్లతో మొదటి స్థానం కైవసం చేసుకుంది. ట్రైబల్ వెల్ఫేర్ జట్టు 190 పాయింట్లు, మైనార్టీ గురుకులం జట్టు 180 పాయింట్లు సాధించి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అన్ని విభాగాల విజేతలకు అతిథులుగా బహుమతులు అందజేశారు.