పాల్వంచ, అక్టోబర్ 23 : ఓ వ్యక్తి నుంచి రూ.26 వేల లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని కరకవాగు గ్రామానికి చెందిన గుగులోతు నాగరాజు కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నాడు.
ఈ క్రమంలో పక్కనే ఉన్న తన మామ ఇంటి నుంచి కరెంట్ తీసుకొని కొత్త ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నాడు. దీనిని గమనించిన లైన్ ఇన్స్పెక్టర్ జినుగు నాగరాజు.. విద్యుత్ వినియోగిస్తున్న కొత్త ఇంటి యజమాని గుగులోతు నాగరాజుపై కేసు నమోదు చేసి, జరిమానా విధిస్తానని భయపెట్టాడు. కేసు లేకుండా చేయాలంటే రూ.65 వేలు ఇవ్వాలని లైన్ ఇన్స్పెక్టర్ డిమాండ్ చేశాడు. తాను అంత ఇచ్చుకోలేనని, రూ.26 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.
తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించిన గుగులోతు నాగరాజు.. వారు చెప్పిన విధంగా పథకం ప్రకారం లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజుకు లంచం డబ్బులు ఇస్తానని చెప్పి పిలిపించాడు. పాల్వంచలోని అంబేద్కర్ కూడలిలో బాధితుడు నాగరాజు నుంచి లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు రూ.26 వేలు లంచం తీసుకుంటుండగా అప్పటికే మాటు వేసిన ఏసీబీ డీఎస్పీ రమేశ్ వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ నిబంధనల ప్రకారం అతడిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రమేశ్ తెలిపారు.