అశ్వారావుపేట రూరల్, ఏప్రిల్ 23: అనేక సంవత్సరాలుగా గిరిజన గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు, అధికారుల చుట్టూ తిరిగి గిరిజనులు విసిగిపోయారు. ఫలితం లేదు. కిరోసిన్ దీపాలతో గడిపారు. రాత్రి ఏడు గంటలైతే విషసర్పాలు, క్రిమికిటకాలు సంచరించేవి తప్ప మనిషి కనిపించే వారు కాదు. విషసర్పాల బారినపడి ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులను అక్కున చేర్చుకుని ఆదరిస్తోంది. ఇక్కడి పథకాలను గిరిజనులకు అందిస్తూ వారికి మౌలిక సదుపాయాలు కలిపించి వెన్నెదున్నుగా నిలుస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలోని ఉట్లపల్లి గ్రామ పంచాయతీలోని గంగారం, వేదాంతపురం పంచాయతీల్లోని తిమ్మాపురం గ్రామాలు 25ఏళ్లగా అంధకారంలో మగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావంతో ఆశలు చిగురించాయి.
తిమ్మపురంలో 80 కుటుంబాలు, గంగారంలో 20 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును ఈ రెండు గ్రామాల గిరిజనులు కలిసి విద్యుత్ సౌకర్యం కలిపించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ అధికారులను సంప్రదించగా అటవీశాఖ అధికారులు గిరిజనులు నివాసముండే భూమి ఫారెస్టు భూమి అని అభ్యంతరాలు పెడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అటవీశాఖ మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి గిరిజనులు పడుతున్న ఇబ్బందుల గురించి ఎమ్మెల్యే వివరించారు. ఎమ్మెల్యే, కలెక్టర్, అటవీశాఖ అధికారి, ఐటీడీఏ అధికారులతో జిల్లా కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆమోదంతో ఈ రెండు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అనుమతులు లభించాయి. ఎమ్మెల్యే తన కోట నుంచి నిధులు కేటాయించారు. విద్యుత్ స్తంభాలు, వీధిదీపాలను నెల రోజుల్లో అమర్చి గిరిజనులకు చీకటి నుంచి విముక్తి కలిగించి వెలుగులు ప్రసాదించారు.
సంవత్సరాల తరబడి చీకటిలో గడిపాం…
సంవత్సరాల తరబడి చీకటిలోనే గడిపాం. ఫారెస్టు అధికారులు ఇబ్బంది పెట్టారు. తెలంగాణ వచ్చాక తిమ్మపురానికి విద్యుత్ సౌకర్యం వచ్చింది. ఎమ్మెల్యే మెచ్చా శ్రద్థ తీసుకుని విద్యుత్ సౌకర్యం కల్పించారు. పగలంతా వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తాం. చీకటి పడితే బయడేవాళ్లం.
– బేతి రమేశ్, గ్రామస్తుడు
విద్యుత్ సౌకర్యంతో ఆనందంగా ఉంది..
విద్యుత్ సౌకర్యం కలిపించడం వల్ల చాలా సంతోషంగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావుకు రుణపడి ఉంటాం. గతంలో రాత్రి పూట భయంతో గడేపేవాళ్లం. ఇప్పడు ఆ భయంలేదు.
– సుజాత, అంగన్వాడీ టీచర్