భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ సంజయ్ జి కోల్టే అన్నారు. శనివారం ఐడీవోసీ సమావేశ మందిరంలో పోలీస్ పరిశీలకులు చరణ్జిత్ సింగ్, వ్యయ పరిశీలకులు శంకర్ ఆనంద్ మిశ్రా, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక ఆల, ఎస్పీ రోహిత్ రాజులతో కలిసి సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి నిర్ణీత సమయంలో పనులన్నీ పూర్తి చేయాలన్నారు. పనుల నిర్వహణకు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేయాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్కు 72 గంటల ముందు ఎంసీసీ బృందాలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ సిబ్బందికి ఇచ్చే శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉండాలని, దీనిని సద్వినియోగం చేసుకొని విధుల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటరు టర్నోవర్ పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు పరిశీలకుడు చరణ్జిత్ సింగ్ మాట్లాడుతూ నిఘా వ్యవస్థ పకడ్బందీగా ఉండాలని, సీజర్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, లోకల్ పోలీసులు తనిఖీలు మరింత పకడ్బందీగా చేయాలన్నారు. వ్యయ పరిశీలకుడు శంకర్ ఆనంద్ మిశ్రా మాట్లాడుతూ అభ్యర్థుల వ్యయ పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సీజర్ల విషయంలో నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు(కొత్తగూడెం, అశ్వారావుపేట) మన జిల్లాలో ఉన్నట్లు తెలిపారు. వాటికి సహాయ రిటర్నింగ్ అధికారులుగా కొత్తగూడెం ఆర్డీవో, అదనపు కలెక్టర్(రెవెన్యూ) ఉన్నారన్నారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మ్యాన్పవర్, ఎంసీసీ, బందోబస్తు, శిక్షణ, ఎక్సైజ్, ఏఎంఎఫ్, రవాణా, వ్యయ పర్యవేక్షణ, కంట్రోల్ రూమ్, సువిధ అనుమతులు, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై వివరించారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, నోడల్ ఆఫీసర్లు, ఎన్నికల సూపరింటెండెంట్లు దారా ప్రసాద్, రంగా ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.