భద్రాచలం, డిసెంబర్ 20: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో వైభవంగా ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాయమ్య బలరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాతసేవ, ఆరాధన, ఆరగింపు, సేవాకాలం, నిత్య బలిహరణం, నిత్య హోమాలు, నిత్య హోమాలు చేపట్టారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా తిరుప్పావై పాశురాలను పఠించారు. అనంతరం ఉత్సవమూర్తులను, నిత్య కల్యాణ మూర్తులను బేడా మండపానికి తీసుకొని వచ్చి అభిషేక తిరుమంజనం నిర్వహించారు. మధ్యాహ్నం స్వామివారికి రాజభోగం సమర్పించారు. అనంతరం పట్టణంలోని తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ చేపట్టారు. బలరామ రూపంలో దర్శనమిచ్చిన శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఏర్పాట్లను ఆలయ ఈవో ఎల్.రమాదేవి పర్యవేక్షించారు.
భద్రాద్రి రాముడు గురువారం శ్రీకృష్ణావతారంలో దర్శనమివ్వనున్నారు. దీంతో పగల్ పత్తు ఉత్సవాలు, స్వామివారి అవతారాలు ముగిస్తాయి. ఆలయ అధికారులు, అర్చకులు శుక్రవారం గోదావరి తీరంలో స్వామివారికి హంస వాహనంపై తెప్పోత్సవం నిర్వహించనున్నారు. శనివారం తెల్లవారుజామున స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు దర్శనమిస్తారు. వేడుకలను కలెక్టర్ ప్రియాంక అల, ఎస్పీ వినీత్ గంగన్న నేతృత్వంలో ఆలయ ఈవో ఎల్.రమాదేవి, సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ హాజరు కానున్నారు.
పర్ణశాల, డిసెంబర్ 20: భద్రాద్రి రామాలయానికి అనుబంధ ఆలయమైన పర్ణశాలలోనూ ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం స్వామివారు బలరాముడి అవతారంలో దర్శననమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో కళాకారులు నిర్వహించిన హరికథా గానం, వయోలిన్ విభావరి, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఏర్పాట్లను అర్చకులు శేషకిరణ్కుమార్చార్యులు, రాజగోపాలాచార్యులు, ఏఈవో శ్రావణ్కుమార్, అనిల్, సూపరింటెండెంట్ కిషోర్ పర్యవేక్షించారు. శుక్ర, శనివారాల్లో జరిగే తెప్పోత్సవం, స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఉంటాయి.
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్సవాల నిర్వహణ, ట్రాఫిక్ రూట్స్, పార్కింగ్ స్థలాలు, లడ్డూ ప్రసాదం, స్టాల్స్, వైకుంఠ ద్వార దర్శనం, సెక్టార్ల ప్లాన్స్ తెలుసుకునేందుకు పోలీస్శాఖ భక్తుల సౌకర్యార్థం క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. కోడ్ను స్కాన్ చేసి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. లేదా https:// mukkoti. netlify.app/ అనే లింక్పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.