ఖమ్మం వ్యవసాయం, జూన్ 23: ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న సమయం వచ్చేసింది. రుతుపవనాలు తెలంగాణకు చేరుకున్నాయి.. గురువారం తొలకరి జల్లుగా వర్షించాయి. రైతుల మోముల్లో చిరునవ్వులు చిగురింపజేశాయి. వాన రాకతో నిన్నమొన్నటి వరకు ఉక్కపోతలు, అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలు ఉపశమనం పొందారు. శుక్రవారం సాయంత్రం ఖమ్మం జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
సుమారు గంట పాటు ఆగకుండా వర్షం కురిసింది. ఖమ్మం నగరంలో తీవ్రత ఎక్కువగా కనిపించింది. మరోవైపు రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేయనున్నది. ఇక వ్యవసాయ పనులు జోరందుకోనున్నాయి.