గిరిజన రైతుల కల సాకారం కాబోతున్నది. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఏళ్లుగా పట్టాల కోసం ఎదురుచూస్తున్న పోడురైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. అర్హులకు పోడు పట్టాలు ఇవ్వడంతోపాటు వానకాలం రైతుబంధు కూడా అందజేయనున్నట్లు ప్రకటించింది. దీంతో పోడు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని ముక్త కంఠంతో పేర్కొంటున్నారు. కాగా, తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్రంలో భద్రాద్రి జిల్లాలో అత్యధికంగా 50,595 మంది పోడు రైతులకు 1,51,195 ఎకరాల భూమిని ఇవ్వనున్నది. ఇందుకోసం పాసుపుస్తకాలను సిద్ధం చేసింది. 2008 నుంచి 2012 వరకు అప్పటి ప్రభుత్వం కేవలం 24వేల మందికి మాత్రమే పట్టాలు ఇచ్చింది. కానీ, సీఎం కేసీఆర్ చట్టం కేంద్రం పరిధిలో ఉన్నా ప్రత్యేక జీవో 140ను తీసుకొచ్చి గిరిజన పోడు రైతులకు పట్టాలిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం, మే 27(నమస్తే తెలంగాణ) : పోడు రైతులకు సర్కారు డబుల్ ధమకా అందించనున్నది. ఏళ్లుగా పోడుసాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వడంతోపాటు వారికి వానకాలం రైతుబంధు సాయం అందించనున్నది. తెలంగాణ చరిత్రలో నిలిచి పోయేలా రాష్ట్రంలో అత్యధికంగా 50,595 మంది పోడు రైతులకు 1,51,195 ఎకరాల భూమిని రైతులకు ఇవ్వనున్నది. ఇందుకోసం పాసుపుస్తకాలను సిద్ధం చేసి ఉంచారు. 2008 నుంచి 2012 వరకు అప్పటి ప్రభుత్వం కేవలం 24 వేల మందికి మాత్రమే పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నది. చట్టం కేంద్రం పరిధిలో ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక జీవో 140ను తీసుకొచ్చి గిరిజన పోడు రైతులకు పట్టాలిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి చరిత్రలో నిలిచిపోయారు.
రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి జిల్లాలోనే
తెలంగాణలో అత్యధికంగా అటవీ ప్రాంతం ఉన్న జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. ఈ జిల్లాలో 10,13,698 ఎకరాల్లో అటవీ భూమి ఉన్నదని సర్వేలో తేలింది. ఇందులో వివిధ కారణాలతో ఆక్రమణలకు గురైన ప్రాంతంలో సక్రమంగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు నష్టం కలగకుండా మూడు అంచెల వ్యవస్థ ద్వారా సర్వే నిర్వహించి అర్హులను గుర్తించారు. అడవిని నమ్ముకుని సాగు చేసుకుంటున్న రైతులకు ఎంతో కాలంగా పట్టాలు లేక ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సమస్యకు సీఎం కేసీఆర్ చరమగీతం పాడారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న సీఎం పోడు భూములపై సబ్కమిటీని వేశారు. సబ్కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 140 జీవోను తీసుకొచ్చి పోడుభూములకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాద్రి జిల్లాలో గిరిజన రైతులు పోడు చేసుకున్నట్లు రికార్డులు ఉన్నాయి. మొత్తంగా 1,51,195 ఎకరాల్లో అర్హులు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తంగా 50,595 మంది రైతులకు పట్టాలివ్వాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కంటే ఎక్కువ మంది రైతులకు పట్టాలిచ్చేది కూడా భద్రాద్రి జిల్లానే అని చెప్పాలి.
సర్వే చేసిన ఆరు నెలల్లో పట్టాలు సిద్ధం
గతేడాది అక్టోబర్లో అధికారులు పోడు సర్వే చేశారు. గ్రామస్థాయిలో గ్రామసభలను నిర్వహించి డివిజన్ స్థాయి కమిటీలో ఆమోదం తీసుకున్నారు. మండలస్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, సెక్రటరీ, వీఆర్ఏ, అటవీశాఖ అధికారులు, డివిజన్ స్థాయిలో ఆర్డీవో, ఎఫ్డీవో, డీడీ అధికారులు విచారణ చేశారు. చివరిగా కలెక్టర్ సమక్షంలో జిల్లాస్థాయి కమిటీ ఆమోదం తెలపడంతో పోడు పట్టాల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. కేవలం సర్వే చేసిన ఆరునెలల వ్యవధిలో పోడుపట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారంటే తెలంగాణ ప్రభుత్వ హయాంలో గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు.
ఇదీ జిల్లా పోడు ముఖచిత్రం..
అత్యధికంగా అటవీ ప్రాంతం ఉన్న భద్రాద్రిలో 726 హేబిటేషన్ పరిధిలో 332 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 21 మండలాల్లో రైతులు పోడు సాగు చేస్తున్నారు. ఇందులో గిరిజనులు 65,616 మంది 2,41,107 ఎకరాల్లో పోడును సాగు చేస్తున్నారు. ఇతరులు 17,725 మంది 58,161 ఎకరాల్లో పోడు చేస్తున్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న ఫారెస్టు కమిటీ సర్వే చేసింది. కచ్చితంగా పోడు సాగు చేసుకుంటున్న రైతులను గుర్తించి అర్హుల జాబితాను సిద్ధం చేసింది.
పోడు రైతులకు వానకాలం రైతుబంధు
ప్రతి రైతుకు తెలంగాణ సర్కారు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నది. ఐదేళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న రైతులకూ రైతుబంధు అందజేస్తున్నది. ఇందులో భాగంగా కొత్తగా పోడు పట్టాలు అందుకునే రైతులకూ ఈ వానకాలం పంటకు రైతుబంధు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో గిరిజన రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. పోడు రైతులన్నీ అన్నివిధాలా ఆదుకుంటూనే అడవిని కాపాడుకునేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. భవిష్యత్లో అటవీ భూముల జోలికి వెళ్లకూడదని గిరిజనులు కూడా సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చారు. గిరిజన సంఘాల నాయకులూ దీనికి పూర్తిస్థాయిలో మద్దతు తెలిపారు.
పట్టాలతోపాటు రైతుబంధు రావడం అభినందనీయం
గిరిజనుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్. ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేం. ఎంతో కాలం నుంచి సాగు చేసుకుంటున్నాం. ఎవరూ సాహసించని పని చేశారు. వెంటనే సర్వే చేయించారు. పట్టాలివ్వడానికి సిద్ధం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ భూమిపై ఆధారపడి జీవిస్తున్నాం. పోడు రైతులకు పట్టాలు ఇవ్వడంతోపాటు రైతుబంధు అందజేయడం అభినందనీయం.. గిరిజనులు కేసీఆర్ను జీవితాంతం గుర్తుంచుకుంటారు. గిరిజనులంతా బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటారు.
-చింతా శ్రీనివాసరావు, నరసాపురం, గుండాల మండలం
పట్టాలన్నీ సిద్ధం చేశాం
పోడు రైతులకు పట్టాలు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. జూన్లో పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఉంది. వానకాలం రైతుబంధు కూడా అందించనున్నది. ఇది గిరిజన రైతులకు శుభపరిణామం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. గిరిజన ప్రాంతంలో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమస్య కొలిక్కి వచ్చింది. ఇక నుంచి అడవి అక్రమణ జరిగితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. అడవిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మొక్కలు పెంచాలి వాటిని సంరక్షించాలి.
-భద్రాద్రి కలెక్టర్, అనుదీప్ దురిశెట్టి