ఖమ్మం లీగల్, నవంబర్ 30: జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, వాటికి బానిస కావొద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టీ.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఖమ్మం న్యాయసేవాధికార సంస్థ కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్లో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లలను మానసిక ఒత్తిడికి గురి చేయవద్దని, పిల్లల్లో వచ్చే మానసిక మార్పులను గమనించి కాపాడుకోవాలని సూచించారు. డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలను అక్రమ రవాణా చేసే వ్యక్తులు చట్ట ప్రకారం కఠిన చర్యలకు గురవుతారని అన్నారు.
ఇప్పటికే మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకున్న వారిని చూసి యువత గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ఒత్తిడిలో ఉన్న వారే మాదక ద్రవ్యాలకు బానిసలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని ప్రత్యామ్నాయ పద్ధతుల వైపు మళించే ప్రయత్నం చేయాలని సూచించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాజేందర్రెడ్డి, ఏసీపీ వెంకటస్వామి, న్యాయవాద సంఘ అధ్యక్షుడు రామారావు, న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు.