ఖమ్మం సిటీ, జనవరి 12: పుట్టకోట గ్రామానికి చెందిన మహిళ ఈఎన్టీ సమస్యతో ఖమ్మం పెద్దాసుపత్రికి వచ్చింది. ఆపరేషన్ సమయంలో మహిళ మృతిచెందడంతో మృతురాలి బందువులు ప్రభుత్వ దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లుపై భౌతిక దాడులకు పాల్పడిన నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గురువారం రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ జిల్లా కేంద్ర ప్రధాన వైద్యశాలకు వచ్చారు. సూపరింటెండెంట్, ఆర్ఎంవో, ఇతర విభాగాలకు చెందిన ముఖ్య అధికారులు, సిబ్భందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా మహిళకు ఆపరేషన్ చేసిన ఈఎన్టీ వైద్యుడు బాబూజాన్ను సస్పెండ్ చేశారు. అతను రిటైర్డ్ కాంట్రాక్ట్ వైద్యుడు కావడంతో తక్షణమే అతడి సర్వీసును రద్దు పరచాలని ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. ఘటనకు సంబందించిన పూర్తిస్థాయి నివేదికను శుక్రవారం టీవీవీపీ సెక్రటరీకి అందజేస్తామన్నారు. వైద్యులు, సిబ్బంది క్రమ శిక్షణతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమం లో రాష్ట్ర జాయింట్ కమిషనర్ డాక్టర్ రమేశ్కుమార్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వినయ్కుమార్, సీసీ యూనిస్, పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, డైటీషియన్ సూర్యపోగు మేరి పాల్గొన్నారు.
పెద్దాసుపత్రిలో వైద్యుల నిరసన : ఖమ్మంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో గురువారం వైద్యులు, సిబ్బంది నిరసన తెలిపారు. పుట్టకోట మహిళ మృతి ఘటనలో ఆమె కుటుంబీకులు, బంధువులు కలిసి దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్పై భౌతిక దాడికి దిగడాన్ని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం, ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సీఐ శ్రీధర్కు ఫిర్యాదు చేశారు. వైద్యులు, ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. వైద్యులపై భౌతిక దాడులు పునరావృతం కాకుండా చూడాలని జిల్లా ఉన్నతాధికారులను కోరారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, వైద్యులు కృపా ఉషశ్రీ, సురేశ్, రామూనాయక్, ఏవో సాగర్, నర్సింగ్ సూపరింటెండెంట్ సుగుణ, ఉద్యోగ సంఘ నాయకులు నందగిరి శ్రీను, వినయ్ తదితరులు పాల్గొన్నారు.