కొత్తగూడెం టౌన్, మార్చి 13: అమ్మ అనే మాట అపురూపమైనదని డీఎంహెచ్వో డాక్టర్ శిరీష పేర్కొన్నారు. పురిటి నొప్పులను పంటిబిగువున భరిస్తూ మరో ప్రాణానికి జన్మనిచ్చే తల్లిని గౌరవించి వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వివిధ కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. కొత్తగూడెంలోని తన కార్యాలయంలో బుధవారం జరిగిన వైద్య శాఖ అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏడాదిపాటు తల్లులు, బాలింతలు తమ ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా ‘అమ్మకోసం’ అనే బృహత్తర కార్యక్రమాన్ని గురువారం నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.
ప్రసవ అనంతరం కొందరు బాలింతలు వివిధ కారణాలతో అనారోగ్యం బారిన పడుతున్నారని, కొందరు అంతుచిక్కని సమస్యలతో మృతిచెందిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు. ఇటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యశాఖ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఈ ‘అమ్మ కోసం..’ అనే ఆరోగ్య క్లినిక్ను ఆరోగ్య కేంద్రాల్లో ప్రతీ గురువారం నిర్వహించాలని, వారికి చికిత్స, సలహాలు అందించాలని సూచించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లే ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సిబ్బందికి ట్యాబ్లు పంపిణీ చేశారు.