‘వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు. ప్రజాసంక్షేమంపై చిత్తశుద్ధి ఉండి వారి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక సీఎం దేశంలో కేసీఆర్ మాత్రమే. కుల వృత్తిదారులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకే ప్రభుత్వం రూ.లక్ష చొప్పున రుణం అందజేస్తున్నది. ఇకపై నియోజకవర్గానికి 300 మంది చొప్పున ప్రతి నెలా రుణాలు అందిస్తాం..’ అని రాష్ట్రరవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని మంత్రి కార్యాలయంలో మంగళవారం బీసీ వృత్తిదారులకు రుణ చెక్కులు అందించి మాట్లాడారు.
– ఖమ్మం, ఆగస్టు 8
ఖమ్మం, ఆగస్టు 8 : సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమ పట్ల చిత్తశుద్ధి, గుండెల్లో ధైర్యం కలిగి ఉన్న ఏకైక సీఎం.. ఆయనేనని అన్నారు. అందువల్లనే నిరుపేదలకు కల్యాణలక్ష్మి, షాదీముబాకర్, ఆసరా పింఛన్లు, దళితబంధు వంటి పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. వృత్తిదారులకు ఆర్థికంగా చేయూతనివ్వడానికే వంద శాతం సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున రుణాలు అందిస్తోందని అన్నారు. ఇకపై నియోజకవర్గానికి 300 మంది చొప్పున ప్రతీ నెలా ఈ రుణాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జ్యోతి ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీసీ కుల వృత్తిదారుల రూ.లక్ష బీసీ రుణాల చెక్కులను ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 12 లక్షల మంది యువతులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సాయాన్ని, 47 లక్షల మందికి ఆసరా పింఛన్లను అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని స్పష్టంచేశారు. ఇటు బీసీ కులాల్లోని వృత్తిదారులను కూడా ఆర్థికంగా ఆదుకుంటున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.
ఖమ్మం జిల్లాలో 14,808 మంది బీసీ వృత్తిదారులకు రుణాలు మంజూరైనట్లు చెప్పారు. ప్రతి నెలా 3 వేల మందికి వీటిని అందిస్తామని అన్నారు. తన క్యాంపు కార్యాలయమే తనకు దేవాలయమని, ఈ కార్యాలయం ద్వారానే నియోజకవర్గంలోని వేలాదిమందికి అనేక సంక్షేమ పథకాలను అందించామని గుర్తుచేశారు. ఎలాంటి షరతులు లేకుండా ఇచ్చే ఈ రుణాలను లబ్ధిదారులు తమ వ్యాపార అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. నిరుపేదల కోసం, సొంత గృహాలు లేని వారి కోసమే సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి గృహలక్ష్మి పథకం కింద 3 వేల ఇళ్లను, దళితబంధు పథకం కింద 1100 యూనిట్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. అర్హులందరికీ అతి త్వరలోనే వాటిని పంపిణీ చేస్తామని అన్నారు. అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్, మేయర్ పునకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, సుడా, ఏఎంసీ, సిటీ లైబ్రరీ చైర్మన్లు బచ్చు విజయకుమార్, దొరేపల్లి శ్వేత, ఆశ్రీఫ్, బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, షకీనా, కర్నాటి కృష్ణ, పసుమర్తి రామ్మోహన్రావు, నీరజ తదితరులు పాల్గొన్నారు.