భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధిస్తోందని దిశ కమిటీ చైర్మన్లు మాలోత్ కవిత, నామా నాగేశ్వరరావు ఆరోపించారు. భద్రాచలంలో గోదావరిపై నిర్మిస్తున్న రెండో వంతెన పనులను ఇంకెంత కాలం సాగదీస్తారని ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన దిశ కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ భద్రాచలం వచ్చే అవకాశం ఉన్నందున పెండింగ్ పనులను సత్వరం పూర్తి చేసేందుకు నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అసమగ్ర సమాచారంతో సమావేశానికి ఎందుకు వచ్చారంటూ రైల్వేశాఖ అధికారులను ప్రశ్నించారు. ఈ విషయంపై రైల్వేశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. కొత్తగూడెం నుంచి కొవ్వూరు వరకు రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని ప్రధానికి, కేంద్ర మంత్రులకు 125కు పైగా లేఖలు రాశానని, అయినా స్పందన లేదని అన్నారు. 75 శాతం సింగరేణి నిధులతో సత్తుపల్లి వరకు రైల్వేమార్గం ఏర్పాటు చేశారని, దానిని అక్కడి నుంచి కొవ్వూరు వరకు పొడిగించకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. తెలంగాణపై చూపుతున్న వివక్ష పట్ల రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని ఇతర రాష్ర్టాలు చేపడితే ఆయా రాష్ర్టాలకు నిధులిస్తున్న కేంద్రం.. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ జిల్లాకు రూ.117 కోట్ల సీఎస్ఆర్ నిధులు చెల్లించాల్సి ఉందని అన్నారు. అయితే వాటిని ఎప్పటి వరకు ఇస్తారో, ఇప్పటికి ఎన్ని ఇచ్చారో చెప్పాలని కోరారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అసంపూర్తి సమాచారంతో ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. గుండాల, దుమ్ముగూడెం ఆస్పత్రుల్లో శవ పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రోగులు వైద్య సేవల కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి వస్తున్నందున గుండాల, చర్ల ఆస్పత్రులను సీహెచ్సీలుగా మార్చాలని కోరారు. ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ సీఎస్ఆర్ నిధులు మంజూరు చేయడం లేదని, అండర్ బ్రిడ్జి మరమ్మతులకు సింగరేణి సంస్థ నిధులేమీ ఇవ్వలేదని, మున్సిపల్ నిధుల నుంచి పనులు చేపట్టామని అన్నారు.
కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. ఎంఈవోల కొరత ఉన్న చోట 10 రోజుల్లో ప్రత్యేక అధికారులను నియమిస్తామని అన్నారు. మారుమూల ప్రాంతాలున్న మన జిల్లాకు వైద్యులు రావడానికి అయిష్టత చూపుతున్నందున వారికి ప్రత్యేక ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, డీఆర్డీవో మధుసూదన్రాజు, కంచర్ల చంద్రశేఖర్రావు, ఎంపీపీలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.