ఖమ్మం జిల్లాలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాలు పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందగా.. ఒక బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. పెనుబల్లి మండలం వీఎం బంజరలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీ లు ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం పాలయ్యా రు. తల్లాడ మండలం రంగం బంజరలో ఆటో బోల్తాపడి కల్లూరుకు చెందిన ఓ బాలుడు మృతిచెందాడు.
తల్లాడ, జూన్ 1: ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో ఓ బాలుడు మృతిచెందిన సంఘటన రంగంబంజర వద్ద గురువారం చోటు చేసుకుంది. కల్లూరుకు చెందిన చింతలపల్లి సాయితేజ(14) వేసవి సెలవులు కావడంతో ఉపాధి కోసం మండలంలోని మల్లవరంలో వేదిక అలంకరణ పనికోసం వచ్చాడు. పని ముగించుకొని ఇంటికి ఆటోలో వెళ్తుండగా మార్గంమధ్యలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో సాయితేజ అక్కడికక్కడే మృతిచెందాడు. సాయితేజ తల్లి ఉమ ఫిర్యాదు మేరకు ఎస్సై సురేశ్ కేసు నమోదు చేశారు.
పెనుబల్లి, జూన్ 1: ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్లు మృతిచెందారు. ఈ ఘటన వీఎం బంజర వద్ద బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. బీహార్కు చెందిన డ్రైవర్ ధర్మేందర్కుమార్(29) లారీతో అసోం నుంచి హైదరాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వైపు నుంచి వైజాగ్కు వెళ్తున్న మరో లారీ ప్రమాదవశాత్తు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ధర్మేందర్కుమార్, మరో లారీ డ్రైవర్ మహారాష్ట్రలోని రాజూరికి చెందిన సంతూష్జయరాం మాడవి (43) ఇద్దరూ క్యాబిన్లో ఇరుక్కుపోయి మృతిచెందారు. వీఎం బంజర పోలీసులు క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్లను క్రేన్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీసి పెనుబల్లి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ను మళ్లించి క్లియర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతుల కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందజేయనున్నట్లు తెలిపారు.
కొణిజర్ల, జూన్ 1: మరో 20 నిమిషాల్లో కుటుంబం గమ్యస్థానానికి చేరుకునేది. బంధు మిత్రులతో కలిసి హాయిగా గడిపేది. కానీ మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందిన ఘటన కొణిజర్లలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైరా మండలం విప్పలమడకకు చెందిన పారుపల్లి రాజేశ్ (38) హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఫార్మసీ కంపెనీలో అకౌంటెంట్ విభాగంలో పనిచేస్తున్నాడు. అక్కడే ప్రగతి నగర్లో భార్య సుజాత(35), కుమారులు అశ్విత్ (8), దివ్యజిత్తో కలిసి నివసిస్తున్నాడు. బుధవారం రాత్రి కుటుంబంతో కలిసి స్వస్థలానికి వచ్చేందుకు కారులో బయల్దేరాడు. కారు గురువారం తెల్లవారుజామున కొణిజర్ల చేరుకుంటున్నది.
ఈక్రమంలో ముందు వెళ్తున్న లారీకి ఎదురుగా రోడ్డు పక్కన నిలిపిన ఆయిల్ ట్యాంకర్ కనిపించింది. దీంతో లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుకే వస్తున్న రాజేశ్ కూడా బ్రేక్ వేశాడు. కారు వెళ్లి లారీని ఢీకొడుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో లారీ కారును ఢీకొట్టింది. రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జు అయింది. కారులో నలుగురు కుటుంబ సభ్యులు బలమైన గాయాలతో ఇరుక్కుపోయారు. స్థానికులు, 108 సిబ్బంది గంట పాటు శ్రమించి వారిని బయటకు తీశారు. అప్పటికే రాజేశ్, సుజా త, అశ్విత్ ప్రాణాలొదిలారు.
దివ్యజిత్కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుమారుడు, కోడలు, మనుమడు మృతిచెందారని సమాచారం అందుకున్న రాజేశ్ తల్లిదండ్రులు, వారి బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. స్థలానికి చేరుకున్న వైరా ఏసీపీ రెహమాన్, సీఐ తాటిపాముల సురేశ్, ఎస్సై శంకర్రావు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. మృతుడి చిన్నాన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మృతదేహాలను సందర్శించి నివాళి అర్పించారు. కాగా.. రాజేశ్ తన సంస్థలో ఇటీవలే 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రూ.3.75లక్షల నగదు రివార్డు అందుకున్నాడు.
వైరారూరల్, జూన్ 1: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన భార్యాభర్తలు రాజేశ్, సుజాత, కుమారుడు అశ్విత్ అంత్యక్రియలను స్వగ్రామమైన విప్పలమడకలోనిర్వహించారు.