సారపాక, ఏప్రిల్ 22 : పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొరుగు రాష్ర్టాల సరిహద్దు అధికారులతో సమన్వయం పాటిస్తూ పటిష్ఠ చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ రవిగుప్తా అన్నారు. సోమవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీసు అధికారులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ఐటీసీ గెస్ట్హౌస్లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. తొలుత ఆయన హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్లో చర్ల మండలం చెన్నాపురం, పూసుగుప్ప, ఉంజుపల్లిలో పోలీసు భద్రతా బలగాల క్యాంప్లను సందర్శించి అక్కడ పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది కి పలు జాగ్రత్తలు, సూచనలు చేశారు.
అనంతరం ఐటీసీ గెస్ట్హౌస్కు హెలీకాప్టర్లో చేరుకోగా ముందుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐటీసీ గెస్ట్హౌస్లో అధికారులతో మాట్లాడుతూ నిషేధిత సీపీఐ మావోయిస్టు కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుని అభివృద్ధి నిరోధకులుగా మారిన మావోయిస్టుల వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
అంతర్ రాష్ట్ర చెక్పోస్టుల వద్ద పనిచేస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అక్రమ నగదు, మద్యం రవాణాను అడ్డుకోవాలని సూచించారు. మావోయిస్తు ప్రభావిత పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకుని సమన్వయంతో అధికారులు పనిచేయాలన్నారు. అనంతరం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకున్నారు.
ఆయన వెంట అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ శ్రీధర్రెడ్డి, గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ విజయ్కుమార్, సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ అడిషనల్ డీజీపీ రవిదీప్సింగ్ సాహీ, సీఆర్పీఎఫ్ సౌత్ సెక్టార్ హైదరాబాద్ జోన్ ఐజీపీ చారుసిన్హా, ఎస్ఐజీపీ సుమతి ఉన్నారు. సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్రాజ్, ములుగు ఎస్పీ శబరీష్, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ప్రభాకర్ ఖరే, ఎస్ఐబీ ఎస్పీ రాజేష్, కొత్తగూడెం ఓఎస్డీ సాయిమనోహర్, భద్రాచలం ఏఎస్పీ పారితోశ్ పంకజ్, ఏటూరు నాగారం ఏఎస్పీ మహేష్ జితే, ట్రైనీ ఐపీఎస్ విక్రాంత్సింగ్, సీఆర్పీఎఫ్ అధికారులు ఆర్కె.పాండా, ఎంకె.మీనా, మోహన్, రితేష్కుమార్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.