దుమ్ముగూడెం, ఫిబ్రవరి 14: భక్తులకు కొంగుబంగారం దుమ్ముగూడెం శ్రీముత్యాలమ్మ 22వ జాతర మహోత్సవాలు 9 రోజుల పాటు కనులపండువగా సాగాయి. చివరిరోజు కావడంతో భారీగా భక్తులు తరలిరావడంతో జాతర ప్రాంతం భక్తజనసంద్రంగా మారింది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రమైన ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రపదేశ్ తదితర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు.
9 రోజుల పాటు అమ్మవారికి నూతన వస్ర్తాలు సమర్పించడంతోపాటు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు, పుష్పాలంకరణ మేళతాళాల మధ్య పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. 3, 6, 9 రోజుల్లో అమ్మవారి గరిగలను స్త్రీ వేషధారణలో పురుషులు తలపై పెట్టుకుని గ్రామాల్లో ఊరేగించారు. తొమ్మిది రోజుల పాటు గ్రామంలోని ప్రతి ఇంటి నుంచీ తొలి అన్నం కుండను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.