భద్రాచలం, మే 26: భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. వారాంతపు సెలవు దినాలు కావడంతోపాటు టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు రావడంతో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో భద్రాద్రికి వచ్చారు. రామయ్యను దర్శించుకునేందుకు అందరూ ఒకేరోజు, ఒకేసారి వచ్చి క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయింది. రద్దీని ముందుగానే ఊహించిన ఆలయ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేయడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగలేదు. ఆలయ ప్రాంగణంలోనూ, క్యూలైన్లలోనూ ‘జై శ్రీరామ్’ అనే జయజయధ్వానాలతో ధ్వనించాయి.
భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అంతరాలయంలోని మూలవరులకు 108 స్వర్ణ పుష్పాలతో అర్చన జరిపారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, ఆరగింపు, సేవాకాలం, నిత్యహోమాలు, నిత్య బలిహరణం తదితర నిత్య పూజలను భక్తి శ్రద్ధలతో జరిపారు. ఆదివారం సందర్భంగా ఉదయం అంతరాలయంలోని మూలవరులకు ప్రత్యేక అభిషేకం జరిపారు. ఈ అభిషేకంలో పాల్గొన్న భక్తులు స్వామిని దర్శించుకొని మురిసిపోయారు. అనంతరం స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను చిత్రకూట మండపానికి తీసుకొని వచ్చి సంప్రదాయబద్ధంగా నిత్యకల్యాణం జరిపి కల్యాణంలో పాల్గొన్న దాతలకు స్వామివారి ప్రసాదాలను, శేషవస్ర్తాలను అందజేశారు.