భద్రాచలం, జనవరి 7: భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలోని మూలమూర్తులకు ఆదివారం అర్చకులు సుప్రభాత సేవ, ఆరాధన, ఆరగింపు, సేవాకాలం, నిత్య పూజలు, నిత్య హోమాలు నిర్వహించారు. నిత్య బలిహరణం చేపట్టారు. 108 స్వర్ణ పుష్పాలతో అర్చన చేశారు. మూలవరులను అభిషేకించారు. అనంతరం నిత్య కల్యాణ మూర్తులను చిత్రకూట మండపంలోకి తీసుకొచ్చి నిత్య కల్యాణం నిర్వహించారు. కల్యాణదాతలకు స్వామివారి తీర్థప్రసాదాలు, శేష వస్ర్తాలు అందజేశారు.
ఏప్రిల్ 17న జరిగే శ్రీరామనవమికి గోటి తలంబ్రాలు ఒలిచేందుకు ఆదివారం ఆంధ్రప్రదేశ్లోని జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయ ఆలయ నిర్వాహకులు, భక్తులు భద్రాద్రి రామాలయానికి వడ్లను తీసుకొచ్చారు. వారికి ఆలయ ఈవో రమాదేవి స్వాగతం పలికారు. అర్చకులు ఆంజనేయస్వామి ఆలయం వద్ద వడ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో ఆలయ ఏఈవో భవానీరామకృష్ణ, వేద పండితులు లింగాల ప్రసాద్శర్మ, ఎస్టీజీ కృష్ణమాచార్యులు పాల్గొన్నారు.
భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో పుష్య మాసం సందర్భంగా ఈ నెల 12న అర్చకులు ‘కూడారై’ పాశురోత్సవం, 108 కలశాలతో పాయసం నివేదన, తిరువీధి సేవ, 13న కరవైగళ్ సందర్భంగా ఆండాళ్ అమ్మవారికి తిరువీధి సేవ, 14. భోగి పండుగ, తిరువీధి సేవ, గోదాదేవి తిరు కల్యాణోత్సవం, ధనుర్మాసోత్సవాలు ముగింపు, 15న మకర సంక్రాంతి సందర్భంగా రథోత్సవం, ప్రణయ కలహోత్సవం, 19న శుక్రవారం సందర్భంగా స్వామివారికి సంధ్యాహారతి, చుట్టు సేవ నిర్వహిస్తారు. 21న సర్వ ఏకాదశి సందర్భంగా తిరువీధి సేవ, చుట్టు సేవ, పవళింపు సేవ ఉండదు. 25న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, పునర్వసు పూర్ణిమ తిరువీధి సేవ ఉంటుంది. 26న పుష్యమి నక్షత్రం సందర్భంగా అర్చకులు రామయ్యకు పట్టాభిషేకం నిర్వహిస్తారు. 27 నుంచి 31 వరకు శ్రీకూరత్తాళ్వార్ తిరు నక్షత్రోత్సవాలు కొనసాగుతాయి. 28న కూరాత్తళ్వార్ తిరునక్షత్రం సందర్భంగా అర్చకులు ఆళ్వార్కు తిరుమంజనం, రాత్రి విశేష భోగ (మధుర పదార్థం) నివేదన, 31న కూరత్తళ్వార్ తిరునక్షత్రం సందర్భంగా ప్రబంధారంభం, తిరుమంజనం, ఆళ్వార్కు చుట్టు సేవ, విశేష భోగ నివేదన చేస్తారు. ఫిబ్రవరి 1న చిత్తా నక్షత్రం సందర్భంగా యాగశాలలో సుదర్శన హోమం నిర్వహిస్తారు.