భక్తుల శివనామ జపంతో శైవాలయాలు మార్మోగాయి. శివుడికి ప్రీతిపాత్రమైన రోజు మహా శివరాత్రి పర్వదినాన ‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ తెల్లవారుజాము నుంచే నినదించాయి. ‘శివ శివ శంకర.. భక్తవ శంకర’, ‘ఓం నమఃశివాయ.. ఓం నమఃశివాయ’ అంటూ భక్తిభావంతో కొలిచాయి. శివయ్యను భక్తిభావంతో కొలుస్తూ.. తలుస్తూ ఆధ్యాత్మిక శోభతో పరిఢవిల్లాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడాయి. కూసుమంచి శివాలయానికి జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి పూజలు చేశారు. పెనుబల్లి మండలం భవన్నపాలెంలోని నీలాద్రీశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దర్శించుకొని పూజలు చేశారు. అన్నపురెడ్డిపల్లిలోని భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా.. భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు స్వామివారిని దర్శించుకున్నారు. రూరల్ మండలం తీర్థాల సంగమేశ్వరస్వామి ఆలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకున్నారు.
ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జి తుంబూరు దయాకర్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం రామలింగేశ్వరస్వామిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బూర్గంపాడు మండలం మోతే పట్టీనగర్లోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని భక్తులు దర్శించుకొని పూజలు చేశారు. మధిరలోని మున్నేరు నది ఒడ్డున ఉన్న మృత్యుంజయస్వామిని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు దర్శించుకున్నారు. ఖమ్మం కాల్వొడ్డులోని గుంటుమల్లేశ్వరస్వామి ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. స్వామివారిని వరుస క్రమంలో దర్శించుకునేందుకు నిర్వాహకులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. జూలూరుపాడు మండలం పాపకొల్లులోని ఉమా సోమలింగేశ్వరస్వామి ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. పలు ఆలయాల్లో వేసవి దృష్ట్యా నిర్వాహకులు భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. రాత్రంతా శివయ్య నామస్మరణతో భక్తులు జాగారం చేశారు.