మధిరటౌన్, అక్టోబర్15: పట్టణంలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు బాలత్రిపుర సుందరిదేవీ అలంకారంలో అలంకరించి అర్చకుడు శేషాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని పలుకూడళ్లలో మండపాలను ఏర్పాటు చేసి అమ్మవారిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేశారు.
ముదిగొండ, అక్టోబర్15: స్థానిక మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీనర్సింహాస్వామి దేవస్థానంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని కొలువు తీర్చారు. అమ్మవారిని బాలత్రిపురసుందరీ దేవీ రూపంలో అలంకరించగా భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రొంపిచర్ల కిశోర్ఆచార్యులు, రొంపిచర్ల యగ్నేశ్ఆచార్యులు పీటల మీద కుర్చొన్న దంపతులకు విశేష పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు చెరుకూరి ఉపేందర్, కొమ్మూరి స్వాతి రమేశ్, నాగేశ్వరరావు, వెంపటి రమేశ్, ప్రశాంత్, వెంకటేశ్ పాల్గొన్నారు.
చింతకాని, అక్టోబర్ 15: మండలంలోని ఆయా గ్రామాల్లో వాడవాడలా కోలువుదీరిన దుర్గామాత అమ్మవారికి భక్తులు పూజలు నిర్వహించారు. సకల సౌభాగ్యాలు, విద్యాబుద్దులు కలగాలంటూ పెద్ద ఎత్తున మహిళా భక్తులు సామూహిక పూజలు, కుంకుమ పూజలు నిర్వహించారు. లచ్చగూడెంలో అమ్మవారికి వైస్ఎంపీపీ గురజాల హనుమంతరావు, సర్పంచ్ గురజాల ఝాన్సీ, మాజీ ఎంపీటీసీ కోప్పుల గోవిందరావుల ఆధ్వర్యంలో మాలధారులు పూజలు నిర్వహించారు.
ఎర్రుపాలెం, అక్టోబర్15: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. స్వామికి సర్వాంగాభిషేకం, నూతన వస్ర్తాలు అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ తీర్థబిందె తెచ్చు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. గణపూజ, ప్రదోషకాల పూజలు అనంతరం రాత్రి 8 గంటలకు మహానివేదన, మంత్రపుష్పము నిర్వహించారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి కొత్తూరు జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, వ్యవస్థాపక కుటుంబసభ్యులు ఉప్పల జయదేవశర్మ, ఉపప్రధాన అర్చకుడు ఉప్పల విజయదేవశర్మ, ఆలయ పర్యవేక్షకులు విజయకుమారి, తాళ్లూరి కోటేశ్వరరావు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.