మధిర, డిసెంబర్ 11: నియోజకవర్గంలోని బోనకల్లులో ఇందిరమ్మ డెయిరీ ఏర్పాటు చేయడమే నా లక్ష్యమని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సోమవారం మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ) అధికారులతో ఇందిరమ్మ డెయిరీ ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను డిప్యూటీ సీఎంగా ఎంపికైన తర్వాత ఇందిరమ్మ డెయిరీ ఏర్పాటే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 2013-14 ఇందిరా డెయిరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, మళ్లీ ఇప్పుడు ఇందిరమ్మ డెయిరీ ఏర్పాటు చేస్తున్నామని, స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వాములు చేసి ప్రతి మహిళకు రెండు గేదెలను ఇప్పించి వాటి ద్వారా పాల ఉత్పిత్తి సేకరిస్తామని అన్నారు. ఇందిరమ్మ డెయిరీ ఏర్పాటుతో 53 వేల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పర్యవేక్షణకు ఆర్డీవో నుంచి ప్రత్యేక అధికారిని నియమించి ప్రతివారం సమీక్ష చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టును తొలుత పైలెట్ ప్రాజెక్టుగా మధిరలో ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు. ఈ సమీక్షలో జిల్లా డీఆర్డీవో పీడీ విద్యాచందన, డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్, ఏపీఎం లక్ష్మణ్, దర్గయ్య, సురేంద్ర, కొట్టే వెంకటేశ్వర్లు, రాంబాబు, భారతి పాల్గొన్నారు.
మధిర, డిసెంబర్ 11: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సోమవారం మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 ముందు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, 2023 వరకు ఉన్న ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం సిద్ధం చేస్తున్నామన్నారు. సరైన సమయంలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఈ నెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయన్నారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీ మొదలుకొని గ్రామస్థాయి అధికారి వరకు ప్రజల కోసం పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ, సంస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజల కోసం మాత్రమే అధికారులు పనిచేయాలన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా నియోజకవర్గంలో ఉన్న ప్రతిఒక్కరికీ పని చేస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి చెప్పుకోవచ్చన్నారు.
చింతకాని, డిసెంబర్ 11: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కను చింతకాని ఎస్సై ఆలకుంట రాజేందర్ మధిరలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. ఈ సందర్భంగా మండలంలో ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలందించాలని ఎస్సై రాజేందర్కు సూచించారు.