ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 12: ఖమ్మం జిల్లా గ్రంథాలయంలోని సమస్యలపై పాఠకులు రోడ్డెక్కారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తామంతా గ్రంథాలయానికి వస్తే.. తమకిక్కడ కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ నిరుద్యోగులు, ఉద్యోగార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పక్కనే ఉన్న బస్ డిపో రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. చదువుకోవడానికి గ్రంథాలయానికి వస్తే కూర్చోడానికి కుర్చీలు, తాగడానికి మంచినీళ్లు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి అత్యవసరానికి వెళ్దామన్నా కనీసం మరుగుదొడ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
వందల సంఖ్యలో పాఠకులు..
ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్కు ఆనుకొని జిల్లా కేంద్ర గ్రంథాలయం ఉంది. అందులోని ఓ వైపున కొత్త భవనంలో డిజిటల్ లైబ్రరీతోపాటు కొన్ని పుస్తకాలు ఉండేవి. మరోవైపున పాత భవనంలో ఇంకొన్ని పుస్తకాలు, దినపత్రికలు ఉండేవి. అయితే పాత భవనం అప్పటికే శిథిలావస్థకు చేరుకొని ఉంది. ఆరు నెలల క్రితం అది పేకమేడలా కూలిపోయింది. అప్పటి నుంచి కొత్త భవనంలోనే పాఠకులందరూ పఠనం చేస్తున్నారు. జిల్లా గ్రంథాలయం కావడంతో నిత్యం వందల సంఖ్యలో నిరుద్యోగులు, ఉద్యోగార్థులు వస్తుంటారు. ఇంత రద్దీ ఉన్న ఈ గ్రంథాలయంలో కనీసం కుర్చీలు గానీ, తాగడానికి మంచినీళ్లుగానీ, అత్యవసరమై వెళ్లడానికి మరుగుదొడ్లుగానీ లేవు. కొత్త భవనంలో ఒకటీ అరా ఉన్నప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న పాఠశాలకు అవి సరిపోవడం లేదు.
దీంతో రోజూ ఇబ్బందులు పడుతూ నెట్టుకొస్తున్నప్పటికీ పాలకులు పట్టించుకోవం లేదు. దీంతో నిత్యం తాము ఇక్కడ పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు, పాలకులకు తెలియజెప్పేందుకు నిరుద్యోగ యువతీ యువకులు నిర్ణయించుకున్నారు. అంతా ఏకమై బుధవారం గ్రంథాలయం ఎదుట డిపో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరుద్యోగులకు మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ తమ సమస్యలను పరిష్కరించాలంటూ పాఠకులు పట్టుబట్టారు. అయితే, ఆందోళనను విరమించకుంటే అందరిపైనా కేసులు నమోదు చేస్తామంటూ పోలీసులు బెదిరింపులకు దిగారు. దీంతో తమ భవిష్యత్తు దృష్ట్యా ఉద్యోగార్థులు, నిరుద్యోగులు ఆందోళన విరమించారు.