లక్ష్మీదేవిపల్లి, నవంబర్ 5 : విద్యుత్ మీటర్ ఎన్వోసీ కోసం రూ.20 వేలు డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ రమేశ్ కథనం ప్రకారం.. రేగళ్ల పెద్దతండాకు చెందిన భూక్యా లక్ష్మా విద్యుత్ మీటర్ కోసం ఎన్వోసీ కావాలని రేగళ్ల పంచాయతీ కార్యదర్శి కాంపాటి పుల్లయ్యకు దరఖాస్తు చేసుకున్నాడు.
ఇందుకోసం కార్యదర్శి రూ.20 వేలు డిమాండ్ చేశాడు. సదరు బాధితుడు అంత డబ్బు ఇవ్వలేనని చెప్పి అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు పన్నిన పథకం ప్రకారం.. బాధితుడు లక్ష్మా కార్యదర్శిని మళ్లీ కలవడంతో డబ్బులు డిమాండ్ చేయగా.. అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కార్యదర్శిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.