మిగ్జాం తుఫాను పత్తి పంటపై తీవ్ర ప్రభావం చూపింది. తెల్ల బంగారం రైతులను కోలుకోకుండా చేసింది. తుఫాను తీవ్రతతో తడిసిన దూది పంట పూర్తిగా రంగు మారింది. చెట్టుపై ఉన్న పత్తి కాయలకు మచ్చల తెగుళ్లను తెచ్చింది. చేలల్లో ఏరకుండా ఉన్న పత్తిని నీటిపాలు చేసింది. దిగుబడులపై గంపెడాశతో ఉన్న రైతులను ఆందోళనకు గురిచేసింది. పంట నాణ్యత కోల్పోవడంతో మార్కెట్లో గిట్టుబాటు ధర లభించడం ప్రశ్నార్థకంగా మారింది. పత్తికి రెండేళ్లుగా మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో సాగుపై ఆసక్తి పెంచుకున్న రైతులకు కన్నీళ్లను మిగిల్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత ఏడాది 1,62,100 ఎకరాల్లో పత్తి సాగు కాగా.. ఈ ఏడాది 2,02,142 ఎకరాలకు పెరిగింది. తుఫానుతో పంట దెబ్బతిని నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అశ్వారావుపేట, డిసెంబర్ 18 : మిగ్జాం తుఫాన్ ప్రభావంతో తెల్ల బంగారంగా పేరొందిన పత్తి పంట నల్లబడింది. చెట్లపై ఏరకుండా ఉన్న పత్తి పంట రంగు మారడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఉన్న పత్తి కాయలకు నల్ల మచ్చలు ఏర్పడి చేనులోనే రాలిపోతున్నాయి. దీంతో పంట దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చే సమయంలోనే తుపాను పత్తి పంట నాణ్యతను దెబ్బతీసిందని మదనపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా గత ఏడాది 1,62,100 ఎకరాల్లో పత్తి సాగు కాగా.. ఈ ఏడాది 2,02,142 ఎకరాలకు పెరిగింది. మిగ్జాం తుఫాన్ వల్ల జిలావ్యాప్తంగా కురిసిన అధిక వర్షాలకు వాణిజ్య పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఇందులో పత్తి పంటకు అధిక నష్టం వాటిల్లింది. పంట నల్లబడిపోవడంతోపాటు కాయలు, ఆకులు నేలరాలిపోయాయి. వరద నీటి నిల్వతో పంట పూర్తిగా తడిసిపోయింది. పంట నాణ్యత కోల్పోవడంతో గిట్టుబాటు ధర లభించడం ప్రశ్నార్థకంగా మారింది. పంట వేసినప్పటి నుంచి రైతులు పడ్డ ఆరుగాలం కష్టం తుఫాన్కు ఆవిరైపోయింది. జిల్లాలో ఈ ఏడాది 2,02,142 ఎకరాల్లో రైతులు పత్తి పంట సాగు చేశారు. గత ఏడాది 1,62,100 ఎకరాల్లో సాగైంది. అంటే.. ఈ ఏడాది అధికంగా 40,042 ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. మొత్తం సాగు ప్రణాళిక సుమారు 5.05 లక్షలు ఎకరాలు కాగా.. అందులో ప్రధానంగా పత్తి పంట 2,02,142 ఎకరాల్లో సాగవుతున్నది. పత్తికి రెండేళ్లుగా మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం..
గిట్టుబాటు ధర లభించడంతో పత్తి సాగు పట్ల రైతులు ఆసక్తి చూపారు. ఈ ఏడాది కురిసిన వర్షాలు ఆరుతడి పంటలకు అనుకూలంగా ఉండగా.. పత్తి పంటకు జీవం పోశాయి. దీంతో పత్తి పంట ఏపుగా పెరిగింది. అదే స్థాయిలో దిగుబడి ఉంటుందని రైతులు, అధికారులు అంచనా వేశారు. పంట చేతికొస్తున్న సమయంలో మిగ్జాం ప్రభావంతో కురిసిన అధిక వర్షాలు పత్తి సాగును ధ్వంసం చేశాయి. వర్షపు నీటితో తోటల్లో పత్తి కాయలు నల్లబడి రాలిపోయాయి. ఆకులపై మచ్చలు వచ్చి వివిధ రకాల తెగుళ్లు సోకాయి. తెగుళ్లతో పత్తి చెట్లు కూడా మాడిపోయాయి. కాగా.. ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం.. సరైన సూర్యరశ్మి అందక పంట తెగుళ్ల బారిన పడుతుందని వ్యవసాయాధికారులు స్పష్టం చేస్తున్నారు. పత్తి సాగవుతున్న భూములు ఎక్కువ ఎత్తు పల్లాల్లో ఉండడంతో వరద నీరు నిల్వ ఉండి లోతట్టు ప్రాంతాల్లో చేలు ఆరడం లేదు. దీంతో చేలల్లో కలుపు కూడా బాగా పెరుగుతోంది. మంచు ప్రభావం సైతం ఎక్కువగానే ఉండడంతో తెగుళ్లు విజృంభించే ప్రమాదం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మరో 40,042 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ లెక్కన దిగుబడి అంచనా 12.13 లక్షల క్వింటాళ్ల దిగుబడి ఉండవచ్చని రైతులు భావిస్తున్నారు. కానీ.. తుఫాన్ ప్రభావంతో దిగుబడులు తగ్గవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.