ఖమ్మం రూరల్, ఏప్రిల్ 9 : ఏటా యాసంగి సీజన్లో ఉన్న నీటివనరుల ఆధారంగా రైతులు ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలు పండిస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే ఒరవడి కొనసాగించిన రైతులు చివరకు మొక్కజొన్న పంటకు నీరందకపోవడంతో కళ్లముందే ఎండిపోతుంటే కన్నీళ్లు పెట్టుకున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో పంట కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలని మదనపడుతున్నారు. జిల్లాకు నీరందించే సాగర్ కాల్వలో ప్రస్తుత యాసంగి సీజన్లో నీటి లభ్యత ఉండకపోవచ్చని అధికారులు ముందస్తుగా తెలిపిన విషయం విదితమే.
ఈ క్రమంలో సాగర్ కాల్వ పరీవాహక ప్రాంతంలోని ముత్తగూడెం, ఆరెకోడు, చింతపల్లి, ఆరెంపుల, పల్లెగూడెం, తెల్దారుపల్లి తదితర గ్రామాల రైతులు మొక్కజొన్న పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. పంట ఆరంభంలో బోరు బావుల్లో ఉన్న నీరు, కాల్వ ద్వారా కొంత నీరు రావడంతో పంటకు సరిపోతుందనే ఉద్దేశంతో పారించుకున్నారు. అయితే పంట ఎదుగుతున్నకొద్దీ నీటి అవసరం ఎక్కువ కావడం.. బోరు బావులు, కాల్వల్లో జలాలు అడుగంటడంతో పంటకు నీరందడం కష్టమైంది. దీంతో చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు సాగర్ కాల్వలోనే బావులు తవ్వి భగీరథ ప్రయత్నం మొదలు పెట్టారు. అడపా దడపా లభ్యమైన నీటితో కొంతకాలం నెట్టుకొచ్చారు.
ప్రస్తుతం ఎండలు ముదరడంతో కాల్వల్లో తవ్విన బావులు సైతం ఎండిపోవడంతో రైతులు చేతులెత్తేశారు. కంకులు పోసుకునే దశలోనే పంట పూర్తిగా ఎండిపోతుండడంతో సాగు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వానకాలం సీజన్లో అదే భూమిలో పత్తి సాగు చేసిన రైతులకు చీడపీడల బెడద వల్ల కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో పత్తి పంటను తొలగించిన రైతులు దాని స్థానంలో మక్కసాగు చేశారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో నీటి ఎద్దడి తలెత్తడంతో రైతులు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. వానకాలం పత్తి పంటకు చీడపీడల బెడద, యాసంగిలో మొక్కజొన్న పంటకు నీటి ఎద్దడి వల్ల రెండు సీజన్లలో పూర్తిగా నష్టపోయామని, ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని సాగు రైతులు కోరుతున్నారు.
రెండెకరాలకు పైగా భూమిని కౌలుకు తీసుకున్నా. రూ.40 వేలకు కౌలు మాట్లాడుకొని కొంత భూ యజమానికి చెల్లించాను. వానకాలం సీజన్లో ఆ భూమిలో పత్తి సాగు చేశాను. నీళ్లు పుష్కలంగా ఉన్నా తెగుళ్లతో నాలుగు క్వింటాళ్ల పత్తి మాత్రమే చేతికొచ్చింది. పెట్టుబడిలో సగం కూడా చేతికి రాలేదు. యాసంగిలో మక్కసాగుతో లోటు పూడ్చుకోవచ్చని పంట వేశాను. పంట చేతికొచ్చే సమయానికి కాల్వలో నీళ్లు రాక.. బావిలో నీరు అడుగంటడంతో పంట ఎండిపోయింది. ప్రభుత్వం ఆదుకొని ఆర్థిక సహాయం అందిస్తేనే బయటపడుతాం.
-అంగిరేకుల కోటేశ్వరరావు, రైతు, ముత్తగూడెం రూరల్