ఖమ్మం, జనవరి 31: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్థాయిని మరిచి ప్రభుత్వ పెద్దలను విమర్శించడం తగదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ అన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాలను కలుషితం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. తన వాపును చూసి బలుపు అనుకుంటున్నారని విమర్శించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
2014లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం ఎంపీగా గెలవడం యాదృచ్ఛికమేనని న్నారు. వ్యక్తిగత బలం వల్ల గెలిచాననే భ్రమలో ఆయన ఉన్నారని అన్నారు. ఆయనకు రాజకీయ స్థిరత్వం లేదని, స్వార్థంతో అనుచరులను సమిధలు చేస్తున్నారని అన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఎక్కడ అంటూ ఇప్పుడు విమర్శలు చేస్తున్న పొంగులేటి.. గతంలో అనేక వేదికల మీద ఆయనే స్వయంగా ఈ పథకాలను కీర్తించలేదా? అని ప్రశ్నించారు.
నారాయణపురంలోని ఆయన 40 ఎకరాల మామిడితోటకు సీఎం కేసీఆర్ ఇస్తున్న ఉచిత విద్యుత్ రావట్లేదా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. పార్టీ అధినాయకుడు చూపిన మార్గంలోనే కార్యకర్తలు, నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు పనిచేయాల్సి ఉంటుందని, వ్యక్తిగతంగా ఏ ఒక్కరికీ సొంత ఎజెండా ఉండదని అన్నారు. నిన్నటి వరకు తెలంగాణ పథకాలు దేశంలోనే గొప్పవని కీర్తించిన పొంగులేటి.. ఈ రోజున అవే పథకాలను విమర్శంచడం విడ్డూరంగా ఉందన్నారు.
వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీని నష్ట పరిచిన వ్యక్తి పొంగులేటి అని అన్నారు. పొంగులేటికి నిజంగా ప్రజాబలం ఉంటే గతంలో తనతోనే ఉన్న పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, లింగాల కమల్రాజు, మదన్లాల్ ఎలా ఓడారని ప్రశ్నించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 సీట్లలో 5 సీట్లను పొంగులేటి అనుచరులకే సీఎం కేసీఆర్ ఇచ్చారని గర్తుచేశారు. అయినా తనకు అన్యాయం ఎలా జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు.
‘నచ్చితే గెలిపిస్తా.. నచ్చకపోతే ఓడిస్తా..’ అనే సూత్రంతో పార్టీకి పొంగులేటి వెన్నుపోటు పొడిచారని అన్నారు. 2014 కంటే ముందు పొంగులేటి పరిస్థితి ఏమిటి?, ఆ తరువాత ఆయన స్థితి ఏమిటి? అనే విషయాలను ఆధారాలతో సహా త్వరలోనే చూపిస్తామని అన్నారు. అబద్దపు ప్రచారాలను బీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొడతారని అన్నారు. కేసీఆర్ పాలన చూసి అనేక రాష్ర్టాల ప్రజలు, నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని, ముందుగా తన వైఖరి ఏమిటో పొంగులేటి చెప్పాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు.
డీసీసీబీ, సుడా, టీఎస్ సీడ్స్ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్కుమార్, కొండబాల కోటేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, రైతుబంధు సమతి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, చింతనిప్పు కృష్ణచైతన్య, రాపర్తి శరత్, ఖమర్, అష్రిఫ్ తదితరులు పాల్గొన్నారు.