అశ్వారావుపేట, జనవరి 21: అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన గర్భిణికి వైద్యబృందం క్రిటికల్ సిజేరియన్ ఆపరేషన్ చేసి తల్లీబిడ్డను కాపాడారు. తెలిసిన వివరాల ప్రకారం.. అశ్వారావుపేట మండలంలోని జమ్మిగూడేనికి చెందిన ముప్పాళ్ల కృష్ణవేణి నిండు గర్భిణి. శనివారం ఆమెకు పురుటి నొప్పులు వచ్చా యి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు ఆమెను పరీక్షించి సాధారణ కాన్పు చేసేందుకు ఎదురుచూశారు. గైనకాలజిస్టు రాధారుక్మిణి సాయంత్రం గర్భిణిని మళ్లీ పరీక్షించారు.
గర్భిణి కడుపులోని బిడ్డ ఉమ్మనీరు తాగుతున్నదని, శిశువు మెడకు పేగులు చుట్టుకున్నాయని గుర్తించి సిజేరియన్ ఆపరేషన్ చేయాలని నిర్ధారించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయకుమార్ వెంటనే అప్రమత్తమయ్యారు. పాల్వంచ ప్రభుత్వాసుపత్రి నుంచి ఎనస్తీయనిస్టు ప్రసాద్ను పిలిపించారు. వైద్యబృందం గర్భిణికి ఆపరేషన్ చేశారు. గర్భిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో గర్భిణి కుటుంబ సభ్యులు వైద్యబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయ్కుమార్ తెలిపారు. ఆసుపత్రి చరిత్రలో ఇదే అత్యంత క్రిటికల్ ఆపరేషన్ అని ఆయన తెలిపారు.