జూలూరుపాడు, మే 14 : పశువుల అక్రమ రవాణాపై పోలీస్ యంత్రాంగం నిఘా తీవ్రతరం చేసిందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి గోవులను అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. మండలంలోని వినోభానగర్ సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టును గురువారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించడంతోపాటు భద్రతా ఏర్పాట్లపై సిబ్బంది పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గోవుల అక్రమ రవాణా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలని ఆదేశించారు. ప్రభుత్వం పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, ఇందులో భాగంగానే జిల్లావ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచామని ఆయన వివరించారు. పశువులే కాకుండా గంజాయి, ఇసుక అక్రమ రవాణాపై ఉకుపాదం మోపుతున్నామని, విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఎస్పీ వెంట సీఐ శ్రీలక్ష్మి, ఎస్సై రవి, ఎస్బీ ఎస్సై చారి, రాంబాబు ఉన్నారు.