ఖమ్మం రూరల్, ఏప్రిల్ 21: బీజేపీ.. ఆర్ఎస్ఎస్ దేశ భవిష్యత్తు ప్రమాదకరమని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దే దించేందుకు కలిసి వచ్చిన పార్టీలతో పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో శుక్రవారం నిర్వహించిన ‘ప్రజాపోరు యాత్ర’ ముగింపు సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయన్నారు.
కార్పొరేట్ శక్తులు అదానీ, అంబానీకి దక్కాయన్నా రు. బీజేపీ చేస్తున్న అరచకాలు, అవినీతి బయటకు వస్తుందనే భయంతో అవసరమైనప్పుడల్లా మతం పేరును ప్రతిసారి తెరపైకి తీసుకవస్తున్నదని మండిపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలకు వంద సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్లే అలవాటు సీపీఐ నాయకులకు ఉండదన్నారు. భూమిపై మనిషి ఉన్నంతకాలం కమ్యునిస్టు పార్టీ ఉంటుందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీని ఓడించడమే ఉభయ కమ్యునిస్టు పార్టీల తక్షణ కర్తవ్యమన్నారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుం చి ప్రజల హక్కులు నిర్వీర్యమవుతున్నాయన్నారు. జీఎస్టీ పేరుతో కేంద్రం ప్రజలను దోచుకుంటున్నదన్నారు. చివరికి రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని విద్యుత్ సంస్థలనూ తమ పరిధిలోకి తీసుకోవాలని చూస్తున్నదన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఉభయ పార్టీలకు చెందిన నాయకులు బాగం హేమంతరావు, దండి సురేశ్, మహ్మద్ మౌలానా, జితేందర్రెడ్డి, పుచ్చకాయల కమలాకర్, సుధాకర్, కరుణాకార్, కళావతి, ప్రసాద్ పాల్గొన్నారు.