ఖమ్మం, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పకడ్బందీగా చేపడుతునట్లు సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి పోలీస్ ఉద్యోగాల ఎంపికలో భాగంగా కీలకమైన ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ) డిసెంబర్ 8 నుంచి ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఇందుకోసం గ్రౌండ్స్లో చేస్తున్న ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. జిల్లాలో దాదాపు 25 వేల మంది అభ్యర్థులు ఈవెంట్లకు హాజరు కానున్నట్లు చెప్పారు.
అభ్యర్థులందరూ నియామక మండలి సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, కేటాయించిన తేదీల్లోనే హాజరు కావాలని స్పష్టం చేశారు. పూర్తిగా డిజిటల్ ఎక్యూప్మెంట్లతో నిర్వహించే ఈవెంట్స్లో ప్రతి అభ్యర్థికీ బయోమెట్రిక్ తర్వాత చేతికి డిజిటల్ ఆర్ఎఫ్ ఐడీ బ్యాండ్స్ అటాచ్ చేస్తారని చెప్పారు. ఫిజికిల్ ఈవెంట్లు చేసే మైదానాల్లో ఇంటర్నెట్ అందుబాటులో ఉంచడంతోపాటు సీసీ కెమెరాలు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరిచారు.
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సూచించిన విధంగా శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమతోపాటు డాక్యుమెంట్లు, అడ్మిట్కార్డుల వంటి వాటిని వెంట తెచ్చుకోవాలని సూచించారు. అదనపు డీసీపీలు సుభాశ్ చంద్రబోస్, కుమారస్వామి, ఏసీపీలు ఆంజనేయులు, ప్రసన్నకుమార్, ఆర్ఐలు రవి, సాంబశివరావు, తిరుపతి, శ్రీశైలం, సీఐలు చిట్టిబాబు, అంజలి, అశోక్కుమార్, సత్యనారాయణరెడ్డి, యూనిట్ డాక్టర్ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.